Sunday, April 28, 2024

CM JAGAN: అందరూ పాల్గొనే గొప్ప పండుగ ‘ఆడుదాం.. ఆంధ్రా’ ….క్రీడాకారుల ప్ర‌తిభ‌కు ప‌ట్టం క‌ట్టే వేదిక

గుంటూరు: ‘‘గ్రామస్థాయిలోని ప్రతిభ గల క్రీడాకారులను వెలికితీసేందుకు, మన పిల్లలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం.. ఆంధ్రా’ టోర్నీ నిర్వహిస్తోంది. నేటి నుంచి మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలబడిపోతాయని చెప్పడానికి గర్వపడుతున్నా.. ఈ టోర్నీ ఫిబ్రవరి 10వ తేదీ వరకు (47) రోజుల పాటు ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇది అందరూ పాల్గొనే గొప్ప పండుగగా చరిత్రలో నిలిచిపోతుంది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ‘ఆడుదాం.. ఆంధ్రా’ టోర్నమెంట్‌ను సీఎం వైయస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులకు పంపిణీ చేయబోయే కిట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తూ, ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పారు. గ్రామస్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరమైపోతాయనేది రెండో ఉద్దేశమని అన్నారు. ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలను అచీవ్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివరించారు.

ఇంకా జ‌గ‌న్ ఏమ‌న్నారంటే …
ఈ కార్యక్రమంలో సచివాలయం నుంచి మండల స్థాయి వరకు వచ్చిన తరువాత, మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి టీమ్‌లు వస్తాయో.. ఆ టీమ్‌లో నుంచి ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీమ్స్‌ అన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సహాయంగా ఉంటాయి. ప్రతిభ కలిగిన వారిని ఆణిముత్యాలుగా మలిచే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు టీమ్‌లు ముందుకు వచ్చాయి.
క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చాయి. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్లంతా మనం ఆడేఆటను చూసేందుకు వస్తారు. ఆణిముత్యాలను వెతికి, వారికి మెరుగులు దిద్ది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈటీమ్స్‌ తోడుగా ఉంటారు.


బ్యాడ్మింటన్‌కు సంబంధించి శ్రీకాంత్, పీవీ సింధు భాగస్వాములు అవుతున్నారు. శ్రీకాంత్, సింధులకు మన రాష్ట్రంలో ఒకరికి, మరొకరికి తిరుపతిలో ల్యాండ్‌ ఇచ్చాం. బ్యాడ్మింటన్‌ అకాడమీలు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వీరికి సహకరిస్తుంది. శ్రీకాంత్, సింధు మెంటార్లుగా వ్యవహరిస్తారు. ప్రతిభ కలిగిన మన పిల్లలకు వీరు తోడుగా నిలుస్తారు.
వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. టాలెంట్‌ హంట్‌లో భాగస్వాములు అవుతారు.

- Advertisement -

మన నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర టోర్నీ ప్రతి సంవత్సరం జరుగుతుంది. గ్రామస్థాయి నుంచి మొదలై.. మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34.19 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేయడానికి ముందుకువచ్చారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి 22 లక్షల 85 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆడుదాం ఆంధ్రాకు ఈరోజు నుంచి శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9000 ప్లే గ్రౌండ్లు గుర్తించి సిద్ధం చేశాం. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్స్, యూనివర్సిటీ గ్రౌండ్స్, మున్సిపల్‌ స్టేడియాలు, జిల్లా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అన్నింటినీ గుర్తించి, డెవలప్‌ చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పాఠశాల స్థాయి నుంచి ప్రోత్సాహం జరుగుతుంది అని త‌న ప్ర‌సంగాన్ని ముగించారు జ‌గ‌న్.

Advertisement

తాజా వార్తలు

Advertisement