Friday, May 3, 2024

టాస్క్ ఫోర్స్ దాడి.. ఏడుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

సత్యవేడు, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో ) : తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు ఈ రోజు ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి 43ఎర్రచందనం దుంగలు, 3మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్సు డి ఎస్ పి చెంచుబాబు కథనం మేరకు రైల్వే కోడూరు ఆర్ఐ కృపానంద, ఆర్ఎస్ఐ అలీభాషా నిన్న రాత్రి నుంచి సత్యవేడు సమీపంలోని నాగలాపురం అడవుల్లో కూంబింగ్ చేపట్టారు.

ఈ రోజు బీరకుప్పం ప్రాంతంలో కొందరు మోటారు సైకిళ్లతో అనుమానాస్పదంగా కనిపించారు. వీరిని ప్రశ్నించడంతో సంబంధం లేని సమాధానాలు చెప్పారు. దీంతో వీరిని అదుపులోకి తీసుకోగా, వీరి వద్ద 43ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు అంగీకరించారు. వీరి నుంచి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

వీరిని తమిళనాడు తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూడి తాలూకాకు చెందిన సభాపతి ధర్మన్ (45), తిరుపతి జిల్లా తొండవాడకు చెందిన ఐ.రవి(32), తిరుపతి సత్యనారాయణపురంకు చెందిన ఎన్.కోదండపాణి (46), సత్యవేడు మండలానికి చెందిన ఎం. నరసింహులు (50), తిరుపతి అవిలాలకు చెందిన బి.రమేష్ (42), నాగలాపురం బీరకుప్పంకు చెందిన ఏ రమేష్ (34), ఏ.మారయ్య (65)లుగా గుర్తించారు.

- Advertisement -

వారినుంచి స్వాదీనం చేసుకున్న దుంగలు 664కేజీలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటాయని డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేసి ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement