Friday, April 26, 2024

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని, ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల నిధులు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే భూమన క‌రుణాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని ఆరా తీశారు. సంక్షేమ పథకాల ద్వారా ఆయా కుటుంబాలకు ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుందో తెలియజేసే రిపోర్ట్ తో కూడిన బుక్ లెట్ ను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా సంక్షేమం, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వాలకు ప్రస్తుత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో చేసిన సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చేలా నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాలన ప్రజల ముంగిటకు తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. కుల మత పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, సంధ్య, టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు బ్రహ్మానంద రెడ్డి, మబ్బు నాద ముని రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట ముని రెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement