Friday, May 3, 2024

నూతన ఆవిష్కరణకు టీటీడీ శ్రీకారం .. భక్తుల అరచేతిలో తిరుమల మార్గదర్శిని

తిరుమల : వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు ఎవరినీ అడగకుండా ఒక చోటి నుంచి మరో చోటికి సులువుగా చేరుకోవచ్చు. సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టీటీడీ ఈ నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలో తన కార్యాలయంలో ఈవో ఏవీ ధర్మారెడ్డి మంగళవారం ఈ విధానాన్ని పరిశీలించారు. తిరుమలలో టీటీడీకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన సుమారు 40 విభాగాల సమాచారాన్ని టీటీడీ క్యూఆర్ కోడ్ లో నిక్షిప్తం చేస్తుంది.

భక్తులు బస్టాండ్ లో దిగి సీఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా టీటీడీ వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్ ను తమ మొబైల్ లో స్కాన్ చేస్తే వారికి విభాగాల వారీగా పేర్లు కనిపిస్తాయి. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్ ప్లే అయ్యి నేరుగా అక్కడికి తీసుకుని వెళుతుంది. టీటీడీ ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు తయారు చేసిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేయడానికి వెళ్ళే శ్రీవారి సేవకులు వారు వెళ్ళాల్సిన ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల ద్వారా ఈ విధానం అమలు అమలు చేయాలని పీఆర్వోను ఈవో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement