Sunday, May 5, 2024

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు లేఖ‌!

ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలంటూ ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ధాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మద్దతుధరకు కొనుగోలు చేయడంలోనూ  ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి.. వారిని నిండా ముంచే విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతల్లో నగదు జమచేసేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం ధాన్యం కొనుగోళ్లు చేసి రెండు నెలలు దాటినా జ‌మ చేయ‌ట్లేదని పేర్కొన్నారు. ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ. 2,500 కోట్ల బకాయిలు ఉన్నాయని, ధాన్యం సేకరణలోనూ తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. పంటలు పండించేందుకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు ఎవరు కడతారు?.. ఖరీఫ్‌కు పెట్టుబడులు ఎవరు ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.  రాయలసీమలో మొత్తం వేరుసెనగ పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదన్నారు. మిల్లర్లు, వైసీపీ నాయకులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement