Tuesday, July 23, 2024

AP | కావాలని కేసులు బనాయిస్తున్నారు.. గవర్నర్​కు చంద్రబాబు లేఖ

టీడీపీ నేతలు, కార్యకర్తలను అణచివేయడమే ధ్యేయంగా అధికార వైసీపీ పార్టీ అక్రమ కేసులు బనాయిస్తోందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను రాజకీయ కక్షలకు వాడుకుని టీడీపీ నేతలను ఇరుకున పెడుతోందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు. మాజీ మంత్రి పుల్లారావు తనయుడు శరత్‌ అక్రమ అరెస్టును ప్రస్తావిస్తూ ఏపీఎస్‌డీఆర్‌ఐ దుర్వినియోగాన్ని లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు.

“అధికార పార్టీకి విధేయుడైన చిలకల రాజేశ్వరరెడ్డిని ఆ సంస్థకు ప్రత్యేక కమిషనర్‌గా నియమించుకుని టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఈ విభాగం ద్వారా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. మళ్లీ ఇప్పుడు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను కేసులో ఇరికించి అరెస్టు చేశారు. శరత్ పనిచేసిన సంస్థలో కేవలం 68 రోజులు మాత్రమే అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించారు. అయినా ఏపీఎస్ఆర్డీఆర్ఐ డిప్యూటీ డైరెక్టర్ సీతారామ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జరిమానా విధించి విచారణ జరుపుతోంది. కేవలం టీడీపీ నేతలను వేధించడమే ఏపీఎస్ఆర్డీఆర్ఐ పనా?.. ఏపీఎస్ఆర్డీఆర్ఐ ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేసింది?” అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

ప్రభుత్వం సీఐడీని జేబు సంస్థగా మార్చుకుని ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధిస్తోంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఏపీఎస్డీఆర్ఐ ద్వారా ప్రత్యర్థులను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరిచే కుట్ర చేస్తోంది. వారి వేధింపులు భరించలేక పలువురు వ్యాపారవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందనే భయంతో టీడీపీ నేతలను టార్గెట్ చేసి వేధిస్తున్నారు. ఇలాంటి చట్టవ్యతిరేక పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అధికారం దుర్వినియోగం చేసే ప్రభుత్వ చర్యను నిలువరించాలని కోరుతున్నా.” అని గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement