Sunday, May 5, 2024

చంద్ర బాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారు – బాలకృష్ణ

టిడీపీ అధినేత చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. సంక్షేమాన్ని గాలికి వదిలేసి… ప్రతిపక్షాలను సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని బాలయ్య ఫైర్ అయ్యారు. టీడీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇలా చేస్తున్నారని అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి.., చంద్రబాబు 16 రోజులైనా జైల్లో ఉండాలనే కుట్ర పూరిత ఆలోచనతో సీఎం జగన్ ఇదంతా చేయిస్తున్నారని బాలకృష్ణ అన్నారు.

చంద్రబాబు కోసం చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారనీ, కొంతమందికి గుండెపోటు వచ్చిందనీ, చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలన్న బాలకృష్ణ.. వారి కోసం తాను వస్తానన్నాను. తర్వలోనే పరామర్శించడానికి యాత్ర చేస్తానని అన్నారు. ఆధారాలు లేకుండా అడ్డగోలు కేసులు పెడుతున్నారనీ, మరిన్ని కేసులు పెట్టేందుకు కూడా ప్రిపేర్ అవుతున్నారనీ, వేటికీ ఆధారాలు లేవని బాలకృష్ణ అన్నారు. స్కిల్ డెవలమెంట్ స్కీమ్ అనేది పాలసీ నిర్ణయం అన్న బాలయ్య.. దాన్ని ఇంప్లిమెంట్ చేసేది కింద ఉండే అధికారులు అన్నారు. ఈ స్కీమ్ మొదట గుజరాత్‌లో అమలైందన్న బాలయ్య.. ఆ తర్వాత ఏపీలో అమలైందన్నారు. తన నియోజకవర్గం హిందూపురంలో కూడా 1200 మందికి దీని ద్వారా ప్రయోజనం కల్పించామన్నారు.

ఒక ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి… 2లక్షల 30 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అని బాలయ్య ప్రశ్నించారు. పరిపాలన చేతకాక… అప్పులు చేశారనీ.. ఆ అప్పులు ఎవరు తీరుస్తారని బాలయ్య ప్రశ్నించారు. టాక్సుల రూపంలో ప్రజలపైనే భారం వేస్తారని అన్నారు. టిట్కో ఇళ్లు ఇస్తామని ప్రజలతో అప్పులు చేయించి… తీరా ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదని బాలయ్య అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారన్న బాలయ్య, ప్రజలు భయపడవద్దు అన్నారు. న్యాయపోరాటం చేస్తామన్నారు. ప్రజలకు తాను అండగా ఉంటానన్నారు. తెలుగువారి సత్తా చూపిద్దామన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement