Monday, April 29, 2024

AP | జగన్ పై దాడి… బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? : పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై విచారణను పోలీసులతోనే చేయించడాన్ని పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. రాయి దాడి జరగడానికి అధికారులు ఏర్పాటు చేయాల్సిన భద్రతా లోపమే కారణమని.. ఆ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయించడం సరికాదని పవన్ కల్యాన్ అన్నారు.

ఈ దాడి విషయంలో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారుల పాత్ర గురించి ముందు విచారణ చేయించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ముందుగా సదరు అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తేనే గులక రాయి విసిరిన చేయి… ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుంది. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుంది అని అన్నారు.

గతంలో జగన్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా పరదాలు కట్టి వెళ్లేవారని.. చెట్లు కూడా కొట్టేసేవారని అన్నారు. అంతటి థ్రెట్ ఉన్న జగన్.. ఏ ఉద్దేశంతో విజయవాడ సిటీలో కరెంటు లేనప్పుడు చీకట్లో యాత్ర చేశారని ప్రశ్నించారు. అక్కడ పరదాలు కట్టడం, చెట్లూ ఎందుకు కొట్టలేదని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించి ఎన్నికల సభలో పాల్గొన్నప్పుడే సెక్యూరిటీపరమైన లోపాలు వెల్లడయ్యాయి అనే విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధానమంత్రి మరోసారి పర్యటించినప్పుడూ ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’ అని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement