Saturday, May 18, 2024

30న ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు.. నోటీఫికేష‌న్ జారీ?

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ఏపీఆర్‌ఎస్‌ఏ) నూతన కార్యవర్గ ఎన్నిక ఈనెల 30వ తేదీన జరగనుంది. వచ్చేనెల 2వ తేదీతో ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం ముగియనున్న నేపద్యంలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర కార్యవర్గ తీర్మానం చేసింది. ఎన్నికల అధికారిగా గుంటూరు జిల్లా పూర్వ అధ్యక్షులు పీవీ కృష్ణారావు వ్యవహరించనున్నారు.

ఈనెల 14న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులతో పాటు మొత్తం 30 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ విజయవాడ రెవిన్యూ భవన్‌లోనిర్వహిస్తారు. అభ్యంతరాలు ఉంటే సవరించి, 20న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తారు.

ఈనెల 30న ఉదయం 10.30 నుండి 11.30 గం టల వరకు నామినేషన్లు స్వీకరణ , అదే రోజు ఉదయం 11.30 నుండి 12.30 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 30న మధ్యాహ్నం 1.45 నుండి 2.45 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక అనివార్యమైతే సాయంత్రం 4 నుండి ప్రారంభిస్తారు. వచ్చేనెల ఒకటో తేదీ ఉదయం 10.00 గంటల నుండి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అనంతరం 17వ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు ఏపీఆర్‌ఎస్‌ఏ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -

ఎన్నికలకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు మొదలుకుని అన్నీ స్థాయిల ఉద్యోగులకు సంబంచిన సమస్యలు తెలుసుకునేందుకు మచిలీపట్నం రెవిన్యూ భవన్‌లో జిల్లా అధ్యక్షులు తోట వెంకట సతీష్‌ అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో బొప్పరాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి గ్రామ రెవిన్యూ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రెవిన్యూ సిబ్బంది, తహశీల్దార్లు హాజరయ్యారు.

క్షేత్ర స్థాయిలో పెరుగుతున్న పని భారం, ప్రభుత్వం నుండి బడ్జెట్‌ మంజూరు కాక అనేక కార్యక్రమాలకు సొంత ఖర్చులు పెట్టు-కుని తీవ్రమైన ఆర్ధిక ఒత్తిడికి లోనవుతున్నారని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రీ- సర్వే విషయంలో లెక్కకు మించి నిర్దేశిస్తున్న టార్గెట్లు పూర్తిచేయ్యలేక తీవ్ర ఒత్తిడిలో ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఓటర్ల జాబితా సవరణలు 2022 జనవరి నుండి ఇప్పటి వరకూ ఉన్న ప్రతీ క్లైమ్ ని రీ- వేరిఫికేషన్‌ చేయడంలో తగిన సమయం లేక మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నామని ఉద్యోగులు వివరించారు.

వచ్చేనెల ఒకటో తేదీన నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశానికి కృష్ణా జిల్లా నుండి ప్రతి రెవెన్యూ ఉద్యోగి గ్రామ రెవెన్యూ సహాయకులు నుండి డిప్యూటీ- కలెక్టర్‌ వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరై 17వ రాష్ట్ర రెవెన్యూ కౌన్సిల్‌ సమావేశాన్ని విజయవంతం చేయాలని బొప్పరాజు కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రామిశెట్టి వెంకట రాజేష్‌, గ్రామ రెవెన్యూ అధికారులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోనా ఆంజనేయ కుమార్‌ (చంటి), రాష్ట్ర సహా అధ్యక్షులు ఆరేపల్లి సాంబశివ రావు, గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికపాటి బ్రంహయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement