Sunday, April 28, 2024

AP – రిజర్వు టీడీపీలో తెగని సీట్ల పంచాయితీ

జంగారెడ్డిగూడెం ప్రతినిధి, (ప్రభ న్యూస్):ఏలూరు జిల్లా లో పోలవరం (ఎస్టీ),చింతలపూడి (ఎస్సీ) రిజర్వుడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తమ నిర్ణయాన్ని రిజర్వు చేసింది. ఈ తీర్పును పసుపు సేన అధిష్టానం ఎప్పుడు వెల్లడిస్తుందో అర్థం కాని స్థితిలో టీడీపీ సీనియర్లలో ఆందోళన నెలకొందంటే అతిశయోక్తి కాదు.ఇది తమ విజయావకాశాలపై ప్రభావంచూపుతుందని తెలుగుతమ్ముళ్లు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గాలున్న ఏలూరు పార్లమెంట్ టికెట్ విషయం లోను స్పష్టత లేకపోవడం కూడాచర్చనీయాంశంగామారింది. ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేసిపరిచయ కార్యక్రమాలతో వైసీపీ వేగం పెంచింది.

నోటిఫికేషన్నాటికి అభ్యర్థులు నియోజకవర్గంలో అందరికీతెలిసి ఉండాలనే వ్యూహందీనికి వెనుక కనిపిస్తోంది. కాగా టీడీపీ ,జనసేనతోపాటుకొత్తగా బీజేపీతోపొత్తులు సంగతి తేలక పోవడతో ఈ అనిశ్చితి వాతావరణానికి కారణంకావటంతో.. అధికార పార్టీకి ఇది కలసి వచ్చే అంశం అని సర్వత్ర భావిస్తున్నారు.

వైసీపీ దూకుడే దూకుడు !

ప్రతి పక్షాల నుంచి ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ అధికార వైసీపీ మాత్రం విడతల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో కనీసం స్థాయిలో అభ్యర్థులను నిర్ణయించలేని గందరగోళం లో తెలుగుదేశం, జనసేన కొట్టు మిట్టాడటం చర్చకు అవకాశమిస్తోంది. బీజేపీతో కలసి వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించుకోవడం వల్లే ఈ జాప్యం అని అర్ధం అవుతోంది.

తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు. జనసేన ఎలాగూ తమ పొత్తిళ్లలో బిడ్డే.. కాబట్టి తమతో ఆటాడు కుంటున్నట్టు టీడీపీ సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమైన స్థానాలు పొత్తులో భాగంగా తమకే కావాలని మెలిక పెట్టడం కూడా తమ బలహీనతను ఆసరాగా చేసుకొనేనని ఆవేదన చెందుతున్నారు.

- Advertisement -

జనసేనకే పోలవరం ?

జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణం దృష్ట్యా పోలవరం సీటు విషయంలో టీడీపీ,జనసేన నేతలు ఈ సీటు తమకు కావాలంటే తమకు కావాలని పంతం తో ఉన్నారు.ఎట్టి పరిస్థితి లోను పోలవరం వదులు కోవడాని తాము సిద్ధంగా లేము..అవసరం అయితే చింతలపూడి తీసుకోమని టీడీపీ స్థానిక నేతలు చెబుతున్నారు. కానీ జనసైనికులు తమకు పట్టున్న స్థానం, కేడర్ కలిగిన పోలవరం ఇచ్చి తీరాలని కోరుతున్నారు.బీజేపీ సైతం ఇదే కోరుతోంది. పైగా గతం లో ప్రజారాజ్యం పార్టీకి ఇక్కడ భారీగా దాదాపు32 వేల ఓట్లు వచ్చినట్టు గుర్తు చేస్తున్నారు.

అంతే కాక పోలవరం టికెట్ కోసం తెలుగుదేశం పార్టీ లోను వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోరగం శ్రీనివాసులు టీడీపీ కన్వీనర్ గా ఉన్నారు. ఆయనదే సీటు అను కోగా మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ఆకస్మికంగా తెరమీదకు వచ్చారు. ఎలాగో లోకేష్ ప్రాపకం సంపాదించిన శ్రీనివాసరావు టికెట్ నాదే నని ధీమాగా లోపాయికారి ప్రచారం లో ఉన్నారు.

ఈ లోగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి రాజ్యలక్ష్మి నిఅభ్యర్థినిగా బరిలోకి దించారు. దీనితో తెలుగుదేశం లో కొత్త వాదం తెచ్చారు. దివంగత శాసన సభ్యుడు పూనెం సింగన్న దొర కోడలు చంద్రకళ పేరు పరీశీలిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు .దీనితో కేడరంతా ఏమి జరుగుతోందోనని ఆసక్తి చూస్తున్నారు.

చింతలపూడి లో మూడు ముక్కలాట

  • వర్గ రాజకీయాలకు చిరునామా గా పేరున్న చింతలపూడి పేరుకు ఎస్సీ స్థానం కానీ.. ఇక్కడ పెత్తనం “దొరల”దే రాజ్యం. .ఈ సంగతి స్థానికంగా తెలిసిందే సిట్టింగ్ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా దీన్ని మరింతగా ప్రాచుర్యం లోకి తెచ్చారు.వైసీపీ అధిష్టానం తెగించి సిట్టింగ్ స్థానంలో కొత్త అభ్యర్థి విజయరాజును పోటీలో దించిందని ఎలీజా వర్గం ప్రచారం చేస్తున్నా…. విజయరాజు మాత్రం ప్రచారం లో దూసుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో అనేకమంది పేర్లు తెరమీదకు వచ్చినా కడకు ముగ్గురిని చంద్రబాబు లెక్కలోకి తీసుకున్నారు. ఎన్నికల ఖర్చు పై అభ్యర్థల మద్య బాబు పోటీ పెట్టారని ప్రచారం జరుగుతోంది.అందులో మాల సామాజిక వర్గంలో బొమ్మాజీ అనిల్ముందున్నారని ఆయనకే టికెట్ అని ఇటీవల వరకు అంతా భావించారు.

  • నూతన సంవత్సర వేడుకలనూ సీనియర్లతో ఆయనతో సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా ఈ కుల సమీకరణ నేపథ్యంలో మాదిగ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించారని గత రెండురోజుల గా చర్చ జరుగుతోంది.ఆ సామాజిక వర్గానికి చెందిన సొంగా రోషన్ కుమార్,ఆకుమర్తి రామారావు పేర్లు మళ్ళీ తెరమీదకు తెచ్చారు.రోషన్ కుమార్ పేరుదాదాపు ఖరారు అయినట్టు ఆయన అభిమానులు చెబుతున్నారు.
  • ఈ విధంగాచింతలపూడి లో అభ్యర్థులు వేట మూడు ముక్కలుగా సాగుతోంది.మధ్యలో మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత పేరు కూడా తెరమీదకు తెచ్చారు. రోజులు గడుస్తున్నా ఎవరి పేరు ఖరారు చేయకుండా గతంలో లోకేష్ యువగళం,ఇటీవల చంద్రబాబు రా కదలిరా.. కార్యక్రమాలను ఈ ఔత్సాహిక అభ్యర్థులే నిర్వహించటం కొసమెరుపు.
Advertisement

తాజా వార్తలు

Advertisement