Sunday, May 19, 2024

AP – నూజివీడు టీడీపీ ఇంచార్జీగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి: ఏలూరు జిల్లాలోని నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తెలుగు దేశం పార్టీ మంగళవారం నాడు నియమించింది. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

పెనమలూరు అసెంబ్లీ స్థానం నుండి గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్థసారథి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా విజయం సాధించాడు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్థసారథి వైఎస్ఆర్‌సీపీని వీడారు. పెనమలూరు, నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుండి పార్థసారథిని బరిలోకి దింపాలని తెలుగు దేశం పార్టీ భావించింది.ఈ క్రమంలోనే ఈ రెండు నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించింది. పెనమలూరులో పార్థసారథికి టిక్కెట్టు కేటాయిస్తే సహకరించవద్దని కూడ బోడే ప్రసాద్ వర్గం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల క్రితం బోడే ప్రసాద్ తో కొలుసు పార్థసారథి సమావేశమయ్యారు.

టీడీపీ నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును ఒప్పించేందుకు తెలుగు దేశం పార్టీ ప్రయత్నించింది. అయితే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నిన్న సీఎంఓ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. దీంతో నూజివీడు అసెంబ్లీ స్థానానికి ఇంచార్జీగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని తెలుగు దేశం నియమించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement