Thursday, April 25, 2024

జగన్ విధానాలతో ఏపీ కూడా శ్రీలంకలా మారే ప్రమాదం : చంద్ర‌బాబు

సీఎం జ‌గ‌న్ విధానాల‌తో ఏపీ కూడా శ్రీలంక‌లా మారే ప్రమాద‌ముంద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. జగన్ పాలనపై ఆయన సొంత సామాజికవర్గం కూడా సంతృప్తిగా లేదన్న చంద్రబాబు.. వైకాపాకు ఓటేసి తప్పుచేశామనే భావన ఆయన సొంత వర్గంలోనే ఉందన్నారు. ప్రధాని వద్ద ఉన్నతాధికారుల వ్యాఖ్యలే.. రాష్ట్ర పరిస్థితికి దర్పణమన్నారు. అశాస్త్రీయంగా, రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక కొత్త జిల్లాలను సరిదిద్దుతామన్నారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రజల అభ్యంతరాలను, నిరసనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని తప్పు పట్టారు. కరెంట్ చార్జీల మోత, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ తెలుగుదేశం నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరెంట్ ఎందుకు పోతోందో.. బిల్లు ఎందుకు పెరిగిందో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement