Tuesday, April 30, 2024

వకీల్ సాబ్ కు మళ్లీ షాక్… హైకోర్టుకు జగన్ సర్కార్!

ఏపీలో వకీల్ సాబ్ సినిమా వ్యవహారం రాజకీయంగా దూమారం రేపుతోంది. బీజేపీ, వైసీపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. అయితే, తాజాగా వకీల్‌సాబ్‌కు మరో షాకిచ్చేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ.. ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మరోసారి కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది.

వకీల్ సాబ్ సినిమా టిక్కెట్లకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమానులు కొందరు ఏపీ హైకోర్టు‌ను ఆశ్రయించారు. కోర్టు వారికి సానుకూలంగా తీర్పును ఇస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్స్ రేట్స్ పెంచుకోవచ్చంటూ సింగిల్ జడ్జ్ తీర్పు ఇచ్చారు. ఏపీలోని 13 జిల్లాల జాయింట్ కలెక్టర్స్‌కు, అలాగే ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ ఇంతలోనే ప్రభుత్వం షాకిస్తూ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌కు సిద్ధమైంది. దీంతో ఈ వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

ఇదిఇలా ఉంటే.. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.. పవన్ ఫ్యాన్స్, జనసైనికులు, బీజేపీల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. పవన్ మీద జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని అభిమానులు, బీజేపీ, జనసేన నాయకులు అంటుంటే.. సినిమాటోగ్రఫీ యాక్ట్‌ ప్రకారం రోజూ 4 షోలకే అనుమతి ఉందని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. ‘మీకు దురద ఉందని, మోజు ఉందని తెల్లవారుజామున 5 గంటలకు వెళ్తే షో వెయ్యరు సునీల్ గారు’ అంటూ బీజేపీ నేత సునీల్ ధియోదర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. స్పెషల్ షోకు పర్మీషన్ ఇవ్వలేదని సునీల్ దియోధర్ ఏడుస్తున్నారని.. అసలు, ఆ షోకు ఆ టికెట్ రేటు ఎంతో తెలుసా అని ప్రశ్నించారు. వకీల్ సాబ్ చిత్రానికి, ఎన్నికలకు ఏంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. సునీల్ దియోధర్ పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పేందుకు వచ్చారా? లేక పువ్వులు పెట్టేందుకు వచ్చారా? అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement