Monday, April 29, 2024

AP – ఇకపై ప్రతి ఏటా “ఆడుదాం ఆంధ్రా” టోర్నీ – జగన్

విశాఖ – దాదాపు 50 రోజుల పాటు జరిగిన “ఆడుదాం ఆంధ్రా” టోర్నీ ఇవాళ ముగిసింది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జరిగిన ఏలూరు-వైజాగ్ జట్ల ఫైనల్ మ్యాచ్ ను జగన్ వీక్షించారు. అనంతరం విజేతలకు జగన్ స్వయంగా బహుమతుల ప్రదానం చేశారు. ఏటా “ఆడుదాం ఆంధ్రా” పోటీల్ని నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు.

రాష్ట్రంలోని ప్రతీ గ్రామం, పట్టణం, ప్రతీ వార్డు నుంచీ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ మెగా టోర్నీ నిర్వహించినట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామస్దాయి నుంచి మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారిని సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలిగితే అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేయగలమనేది ఇందులో మరో లక్ష్యమన్నారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి ఐదు రకాల క్రీడల్ని 47 రోజులుగా గ్రామస్దాయిలో పరిచయం చేశామన్నారు.

“ఆడుదాం ఆంధ్రా” టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశామని సీఎం జగన్ తెలిపారు. అలాగే విజేతలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతీ ఏటా “ఆడుదాం ఆంధ్రా” టోర్నీని నిర్వహిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.

కాగా , ఆడుదాం ఆంధ్రా” పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. గత డిసెంబర్ 26న జగన్ ప్రారంభించిన ఈ టోర్నీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందులో దాదాపు 3 లక్షల మ్యాచ్‌లు జరిగాయి. సచివాలయ స్థాయి పోటీల నుండి రాష్ట్ర స్దాయిలో ఉన్న క్రీడాకారుల వరకు ఇందులో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement