Tuesday, April 30, 2024

AP: ఐదేళ్లుగా సాగుతున్న ద‌మ‌న‌కాండ‌కు ఇక చ‌ర‌మగీతం – ప‌వ‌న్ క‌ల్యాణ్

పిఠాపురం – ఐదేళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న ప్రభుత్వ దమనకాండకు చరమగీతం పలికే సమయం ఆసన్నమైంది… ఈ ఎన్నికలు రాష్ట్రానికే కాదు భవిష్యత్ తరాలకు ఎంతో కీలకమైనవి. అందుకోసం టీడీపీ, బీజేపీతో కలసి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముందుకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 60 నుంచి 70 వేల మంది ప్రజల ఆశీర్వచనాలతో వచ్చి ఈ రోజు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పిఠాపురం అసెంబ్లీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రామసుందర రెడ్డికి అందజేసి ప్రమాణం చేశారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ మిగిలిన పార్టీలతో సమంగా బలం పుంజుకున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేసి ముందుకు వెళ్లాం. మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం లాంటి 40 నియోజకవర్గాల్లో బలమైన ప్రజా నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ పోటీ నుంచి విరమించుకోవాల్సి వచ్చింది. పిఠాపురంలోనూ బలమైన నాయకులు, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న నాయకులు వర్మ త‌న కోసం సీటు త్యాగం చేశారన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాల కోసమే. వారికి భవిష్యత్తులో ఉన్నత స్థానం లభించాలని కోరుకుంటూ దానికి త‌న వంతు కృషి ఉంటుందని తెలియజేస్తున్నానన్నారు. కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా టీ టైమ్ వ్యవస్థాపకులు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఎంపీగా ఎన్నికైతే మన ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం, ఓఎన్జీసీ కాలుష్యం తదితర అంశాలపై బలంగా గళం విప్పగలరన్నారు. ఇక్కడ త‌మకు మద్దతు ఇచ్చిన బీజేపీ నాయకులు బుర్రా కృష్ణంరాజు కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించబోతోంది. దానికి నేటి నామినేషన్ కి మద్దతుగా తరలివచ్చిన ఆశేష ప్రజానీకమే తార్కాణమ‌న్నారు.

వైసీపీ సర్కార్ చేతిలో మీడియా నలిగిపోయింది…
నెల మొదటి తేదీన సామాజిక పింఛన్లు ఇళ్లకు తీసుకువెళ్లి ఇవ్వకపోతే దాని వెనుక ప్రభుత్వ కుట్ర ఉన్నట్టే. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ప్రభుత్వ అధికారులు అడ్డంకులు కలిగించకపోతే ఫించన్ ఇంటికే చేరుతుంది. ఈ ప్రభుత్వం చేతిలో నలిగిపోయిన మీడియాకి తాము అండగా ఉంటామ‌న్నారు. మీ కష్టాల్లో పాలు పంచుకుంటాం.. గతంలో ముక్కోణపు పోటీ ఉంది.. ఇప్పుడు ఉమ్మడిగా ముందుకు వెళ్లడం వల్ల సమస్యలపై మరింత బలమైన పోరాటానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ, బీజేపీ ఇంఛార్జ్ బుర్రా కృష్ణంరాజు, కాకినాడ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివప్రతాప్, పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement