Friday, May 3, 2024

Delhi | వివేక హత్య కేసులో మరో పరిణామం.. పీఏ కృష్ణారెడ్డి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తనను బాధితుడిగా పరిగణించాలంటూ వివేకానంద వ్యక్తిగత సహాయకుడు A9 ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం డిస్మిస్ చేసింది. కేసును పూర్తిగా విని మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను హైకోర్టుకే ఇచ్చింది దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాలు చేసేందుకు అర్హత ఉన్న వ్యక్తిగా తనను గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గతంలో వివేక కేసును ఏపీ నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేస్తూ వివేకా సతీమణి, కుమార్తె సునీతాలను ధర్మాసనం నిజమైన బాధితులుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో బాధితులు ఎవరన్న దానిపై సుప్రీంలో స్పష్టత తీసుకోవాలని ఎంవీ కృష్ణారెడ్డికి హైకోర్టు సూచించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్దంగా లేమని జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. వాద ప్రతివాదులకు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో హైకోర్టు ఎదుటే చెప్పుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. సుప్రీంకోర్టు అభిప్రాయాలతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. దీనిపై గురువారం లిఖితపూర్వక ఆదేశాలిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement