Friday, May 10, 2024

ప్రభుత్వ విద్య కళ కళ.. విద్యావ్యవస్థకు కొత్త వెలుగు..

నెల్లూరు, ప్రభ న్యూస్‌ : జిల్లాలో దాదాపు 2 వేలకు పైగా ప్రభుత్వ రంగంలో ప్రాథమిక , ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఉండగా , ఆయా పాఠశాలల్లో 2018 -19 విద్యా సంవత్సరంలో 2,08,288 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే విధంగా ఆ విద్యా సంవత్సరానికి కేంద్ర విద్యా సంస్థల్లో 2466 మంది చదువుకు ంటుండగా , సొసైటీల కింద నడిచే పాఠశాలల్లో 20,985 మంది చదువుకుంటు న్నారు. ఇక ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 1,64, 705 మంది విద్యను అభ్యసిస్తుండగా , 2018 -19 విద్యా సంవత్సరానికి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు జిల్లాలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 3,96,444 మందిగా ఉంది. అయితే 2020 -21 నాటికి పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చింది . కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో 2466 నుంచి 2699కి విద్యార్థుల సంఖ్య పెరగగా , సొసైటీల్లో చదివే వారి సంఖ్య 20,985 నుంచి 21, 199కి పెరిగింది . అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల్లో ఏకంగా 2,08,288 నుంచి ఏకంగా 2,44,605కు విద్యార్థుల సంఖ్య అంటే దాదాపు 36వేల మందికిపైగా ప్రభుత్వ రంగంలో వి ద్యార్థులు పెరిగారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 1,64,705 నుంచి 1,40,689కి అంటే దాదాపు 24 వేల మంది విద్యార్థులు తగ్గిపో యారు. ప్రభుత్వ విద్యావ్యవస్థపై పెరుగుతున్న ఆసక్తికి ఈ గణాంకాలు నిదర్శనంగా ఉన్నాయి.

సత్ఫలితాలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం 2019 మే నెలలో ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపింది . గత ప్రభుత్వాలు .. ప్రైవేటు విద్యాసంస్థలను ఇబ్బడిముబ్బడిగా ప్రొత్సహించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోయినప్పటికీ కేవలం ప్రభుత్వ విద్యాసంస్థలపై శ్రద్ధ చూపి గణనీయమైన ఫలితాలను సాధించింది . సౌకర్యాల్లో గతంలో ప్రభుత్వ విద్యాసంస్థలతో పోలిస్తే ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కువ సౌకర్యాలు ఉండేవి . నాడు – నేడు పథకం కింద పాఠశాలల వాతావరణమే సమూలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జిల్లాలో 2 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా , తొలి దశలో 1059 పాఠశాలలను నాడు – నేడు పథకం కింద అభివృద్ధి చేయడం జరిగింది. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిని మించి ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మిగిలిన పాఠశాలల్లో రెండో దశ కింద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటితో పాటు అమ్మఒడి కార్యక్రమం కింద తల్లుల ఖాతాల్లోకి నగదు జమ జరుగుతుండడం , ముఖ్యంగా పౌష్టికాహార లోప నివారణలో భాగంగా మిడ్‌ డే మీల్స్‌ను మరింత మెరుగుపరిచి జగనన్న గోరుముద్ద అమలు ద్వారా ప్రత్యేక మెనూ , పౌష్టికాహార పంపిణీతో పాటు జగనన్న విద్యాకానుక కింద ప్రత్యేక బోధనోపకరణాల కిట్‌ను అందజేయడం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న వారిలో అట్టడుగు వర్గాల వారే అధిక సంఖ్యలో ఉన్నారు. వారందరూ ఇప్పుడు తమ పిల్లలను చక్కగా చదివించుకుంటున్నారు. అదే విధంగా వారిలోనే కొంతమంది అప్పో , సప్పో చేసి ప్రైవేటు విద్యాసంస్థల్లో తమ పిల్లలను చదివిస్తున్న వారు కూడా తిరిగి తీసుకొచ్చి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుస్తున్నారు. ప్రైవేటు రంగంలో చదువుకుంటున్న విద్యార్థుల్లో తెల్ల రేషన్‌ కార్డు కలిగిన వారికి అమ్మఒడి పథకం వర్తింప చేస్తుండబట్టే ఆయా విద్యాసంస్థల్లో కూడా వెలుగు కానవస్తోంది. జిల్లాలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యాస ంస్థలను నాడు – నేడు పథకం కింద అభివృద్ధి చేసే కార్యక్రమాలు పూర్తి అయితే ప్రైవేటు విద్యాసంస్థల్లో అమ్మఒడి పథకం వర్తింపు ఉండదన్న అభిప్రాయం కూడా ఉంది. ఏతావాతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు ప్రభుత్వ విద్యాసంస్థలకు కొత్త వెలుగు , ప్రోత్సాహం ఇచ్చాయనడంలో సందేహం లేదు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement