Thursday, May 2, 2024

AP: టాస్క్ ఫోర్స్ దాడుల్లో 25మంది ఎర్రస్మగ్లర్లు అరెస్టు

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : రాయలసీమ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో 25మంది స్మగ్లర్లు పట్టుబడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ముందుగా అందిన సమాచారం ప్రకారం టాస్క్ ఫోర్సు డీఎస్పీలు మురళీధర్, చెంచుబాబుల అధ్వర్యంలో కడప, రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐలు నరేష్, ఆలీబాషా తమ బృందాలతో కర్నూలు జిల్లాలో కూంబింగ్ చేపట్టారు.

చాగలమర్రి దగ్గర ఇరమడక వైపు వస్తున్న లారీని తనిఖీ చేయగా, అందులో 22మంది స్మగ్లర్లు కనిపించారు. వారి ద్వారా సిరసెళ్ల రిజర్వు ఫారెస్టు నందు డంప్ చేసిన 11ఎర్రచందనం దుంగలను, లారీని స్వాధీనం చేసుకున్నారు. వీరిని తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన తెర్తగిరి పెరియస్వామి (42), పళని ఆండి (49), తిరువన్నామలై జిల్లా రాజేంద్రన్ చిన్నపయ్యన్ (60), కుమార్ మాణిక్యం (43), బాబు చిన్నవేలయ్యన్ (37), రమేష్ చిన్నస్వామి (38), రఘుపతి (23), అన్నామలై (29), ధర్మపురి జిల్లా చిన్నరాజి రామన్(33), చిన్నరాజిపూచితీర్థన్ (33), తిరువన్నామలై జిల్లా ప్రకాష్ (20), హరికృష్ణన్ (23), సెల్వరాజిరామన్ (45), తీర్థగిరి చిన్నతీర్థన్ (48), రాజమణి (37), రామన్ (24), లక్ష్మణన్ (24), సతీష్ కుమార్ (19), విశ్వనాథన్ (27), ధర్మపురి జిల్లా రవి (37), ఏపీ జిల్లా నంద్యాల టౌన్ జి. దాస్ (56), షేక్ అబ్దుల్ సత్తార్ (41)లుగా గుర్తించారు.


అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఆర్ఐ చిరంజీవులు, ఆర్ఎస్ఐ మురళీధర్ రెడ్డిల బృందం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ నుంచి రాజంపేట చిట్వేల్ రేంజ్ రెడ్డివారిపల్లి వైపు కూంబింగ్ చేపట్టారు. పెద్దకోన వంక వద్ద కొందరు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లు పక్కన పెట్టి అనుమానాస్పదంగా కనిపించారు. వీరు టాస్క్ ఫోర్సు అధికారులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా.. వారిలో ముగ్గురిని పట్టుకున్నారు. వారి వద్ద 10ఎర్రచందనం దుంగలను, మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిని రైల్వే కోడూరు మండలానికి చెందిన కనపర్తి చంద్రశేఖర్ (31), కనపర్తి హరిబాబు (35), తిరుపతి కొర్లగుంటకు చెందిన దగ్గుపాటి ప్రవీణ్ కుమార్ (35)లను అరెస్టు చేశారు. ఈ రెండు కేసులను సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ రఫీలు తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు దాడుల్లో టన్నుకు పైగా పట్టుబడిన దుంగల విలువ రూ.60లక్షలు ఉండవచ్చునని అంచనా వేశారు. ఆపరేషన్లలో పాల్గొన్న సిబ్బందికి కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ రివార్డులను ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement