Friday, May 3, 2024

Telangana – నేటి నుంచే జీరో క‌రెంట్ బిల్లుల రీడింగ్ ..

హైదరాబాద్‌: నగరంలో సున్నా కరెంట్‌ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్‌) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది. 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది. ఈ మేరకు బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్‌ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. టెస్టింగ్‌ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశారు. అంత సక్రమంగా ఉన్నట్లు ఇంజినీర్లు నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేటి నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. అలాగే గ్రామాల‌లో సైతం ఈ వారంలోనే సున్నా రీడింగ్ తీయాల‌ని ఆదేశాలు జారీ అయ్యాయి..

భాగ్య‌న‌గ‌రంలో 19.85 లక్షల మంది అర్హులు..

నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 48.06 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రజాపాలనలో జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కలిపి గృహజ్యోతికి 19.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రకటించడంతో.. ఇప్పటివరకు 11 లక్షల మందే ఈ పథకానికి అర్హులుగా తేలారు.

అర్హ‌త ఉన్నా సున్నా బిల్లు రాక‌పోతే ..

అర్హత ఉండి సున్నా బిల్లు రాకపోతే.. మున్సిపల్‌, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆహార భద్రత కార్డు, దీనికి లింక్‌ చేసిన ఆధార్‌, గృహ విద్యుత్తు కనెక్షన్ల నంబర్‌ను దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వీటిని విద్యుత్తు సిబ్బంది పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. తర్వాతి నెల నుంచి సున్నా బిల్లు వస్తుంది. అవసరమైతే సవరించిన బిల్లు జారీచేస్తారు. వారు బిల్లు కట్టలేదని ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని కూడా సర్కారు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement