Friday, May 3, 2024

NZB | నిజాం షుగర్స్ ని తెరిపిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు

బోధన్, (ప్రభ న్యూస్) : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. శనివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని రాష్ట్ర ఐ.టీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సందర్శించింది.

నిజాం చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ మేరకు శనివారం చైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పి.భూపతి రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తదితరులు బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు.

కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిల్లరీ యూనిట్ తదితర వాటిని పరిశీలించి, ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు, నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత 2015 లో లే ఆఫ్ గా ప్రకటించబడి మూతబడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం రైతులు, రైతు సంఘాల నాయకులతో ముఖాముఖిగా భేటీ అయిన కమిటీ సభ్యులు, వారి అభిప్రాయాలను సేకరించారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు హర్షం వెలిబుచ్చుతూ, కర్మాగారం పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కమిటీ దృష్ఠ్టికి తెచ్చారు.

- Advertisement -


ఈ సందర్భంగా సబ్ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరుకావడం జరిగిందన్నారు. రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి, లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు.

రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ అభిమతమని, ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పరిస్థితులు ఎలా ఉంటాయి, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటీ అనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, అవసరమైతే రైతులను హైదరాబాద్ కు కూడా పిలిపించి చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామిక నిపుణులతోనూ చర్చిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణం వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా కల్పించారు. ఫ్యాక్టరీని తెరిపించించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే రైతులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండే వాస్తవ పరిస్థితులను తెలుపుతూ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు.


ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు హామీలైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 27న మరో రెండు హామీలైన రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

ఇదే కోవలో రైతులకు ఇతోధికంగా మేలు చేకూర్చాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరుపుతోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే దిశగా ముందుకెళ్తోందన్నారు. దీనివల్ల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తృతికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపడతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కోసం మరో పది రోజుల్లోనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు. సబ్ కమిటీ భేటీలో నిజాం షుగర్స్ ఎం.డీ డాక్టర్ మక్సూద్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్సీ అర్కల నర్సారెడ్డి, బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ పద్మశరత్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, రైతులు, రైతు నాయకులు, కార్మికులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి శ్రీధర్ బాబును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు బొకేలు అందించి స్వాగతం పలికారు. మంత్రి శ్రీధర్ బాబు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement