Saturday, April 27, 2024

Warangal – కాంగ్రెస్‌తోనే అరిగోస‌.. వాళ్లొస్తే చీక‌టి రాజ్య‌మే …కెసిఆర్

వరంగల్‌: 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సేనని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, ‘కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ గెలిస్తే మళ్ల ఇందిరమ్మ రాజ్యం తెస్తం అంటున్నరు. ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రపు రాజ్యం ఇంకోటి లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో అరాచకాలు జరిగినయ్‌. తెలంగాణ కోసం ఉద్యమించిన 400 మందిని కాల్చిచంపిండ్రు. ఎమర్జెన్సీ పెట్టి అందర్నీ జైళ్లల్ల పెట్టిండ్రు. అసుంటి రాజ్యం మళ్ల గావాల్నా..? కాంగ్రెస్‌ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టి 58 ఏండ్లు మనలను గోసపెట్టింది. కొట్లాడంగ, కొట్లాడంగ ఆఖరికి తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ ఏర్పడంగనే బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఆసరా పెన్షన్‌లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతబంధు, రైతుబీమా లాంటి పథకాలు తీసుకొచ్చినం. అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా తాము నిర్ణయాలు చేసినం’ అని చెప్పారు.

”దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభను వరంగల్‌లో నిర్వహించాం. తెలంగాణ సాధించడం కోసమే భారాస పుట్టింది. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టారు?. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు చూడాలి. వరంగల్‌లో గతంలో 3-4 రోజులకు ఒకసారి నీళ్లొచ్చేవి. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా రోజూ బ్రహ్మాండంగా వస్తున్నాయి. వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్‌ పార్కు తీసుకొచ్చాం. ఏడాదిలో లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి” అని కేసీఆర్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement