Sunday, April 28, 2024

TS – బీఆర్ఎస్ అంటే బిల్లా, రంగా సమితి – రేవంత్

మహబూబ్‌నగర్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు మహబూబ్‌నగర్‌లో నేడు నిర్వహించిన పాలమూరు ప్రజాదీవెన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తెలంగాణను దోచుకున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు.

అప్పట్లో పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావును దివంగత ప్రధాని నెహ్రూ ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేశారు రేవంత్. తాను తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయట్లేదని కేటీఆర్‌కు చురకలంటించారు. మొదటిసారి జడ్పీటీసీగా తనను పాలమూరు ప్రజలు గెలిపించారన్నారు. తమ తాతలు, ముత్తాతలు సీఎంలు కాదు, తనకు కోట్ల రూపాయలు ఇవ్వలేదని తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని రేవంత్ చెప్పుకొచ్చారు. తన పూర్వీకులురాజకీయ నాయకులు, సీఎంలు కాదన్నారు.

‘మీరే నన్ను 2007లో ఎమ్మెల్యే చేశారు. 2014లో నన్ను మళ్లీ గెలిపించారు. మల్కాజ్‌గిరి గెలుపుతోనే సోనియాగాంధీ నన్ను పీసీసీ అధ్యక్షుడిగా చేసింది. రాష్ట్ర అభివృద్ధిపై సభా ముఖంగా పీఎంను నిలదీశాను. ప్రధానికి ఎందుకు వినతిపత్రాలు ఇచ్చారని కొందరు మాట్లాడుతున్నారు. నేను గదిలో వినతిపత్రం ఇవ్వలేదు, నిండు సభలో అడిగాను. అతిథి మన రాష్ట్రానికి వస్తే గౌరవించడం మన ఆచారం. విజ్ఞతతో కూడని వినతిపత్రాలు దేశ ప్రధానికి ఇచ్చా’ అని బీఆర్ఎస్ నేతల విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ప్రధానికి మోడీకి గౌరవిస్తామని.. కానీ, తెలంగాణ అభివృద్ధికి సహకరించకుంటే.. కేంద్రంపై పోరాటం తప్పదని హెచ్చరించారు.

బీఆర్ఎస్ అంటే బిల్లా, రంగా సమితి అని రేవంత్ ఎద్దేవా చేశారు. హరీశ్ రావు, కేటీఆర్‌ను చూస్తే బీఆర్ఎస్ బిల్లా, రంగా సమితి అనిపిస్తోందని రేవంత్ విమర్శించారు. అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. దేశంలోని మోడీతోనైనా, రాష్ట్రంలోని కేడీతోనైనా కొట్లాడతానని వ్యాఖ్యానించారు. పాలమూరును అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత తనదని అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు తొలగించేందుకు సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారని చెప్పుకొచ్చారు.

2024 నుంచి 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ధీమా వ్యాక్తం చేశారు సీఎం రేవంత్. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పదేళ్లు చొప్పున ఈ రాష్ట్రాన్ని పాలించాయన్నారు. కాంగ్రెస్ కూడా పదేళ్లు అధికారంలో ఉండి తీరాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని కూలదోసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఎవరైనా తోక జాడిస్తే కత్తిరించే కత్తెర తన చేతిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగాలేదని అసెంబ్లీ సమావేశాలకు రాని కేసీఆర్.. నల్గొండ సభకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.

- Advertisement -

ఇక్కడి కేడీ, అక్కడి మోడీ కలిసి ఎస్సీలకు అన్యాయం చేశారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిపించేంత వరకు కార్యకర్తలు విశ్రమించవదని కోరారు. పాలమూర-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని మోడీ గతంలో హామీ ఇచ్చారు. పదేళ్లు గడిచినా ప్రధాని మోడీ తన హామీని నెరవేర్చలేదని విమర్శించారు రేవంత్. రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురాని బీజేపీ నేతలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

కాగా, ఈ భారీ బహిరంగ సభలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పాలమూరు పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి వంశీచందర్, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement