Thursday, April 25, 2024

Trs Plenary: ప్ర‌తీ పల్లె నుంచి టీఆర్ఎస్‌ ద్విద‌శాబ్ది ఉత్స‌వాల‌కు త‌ర‌లి రావాలన్న కేటీఆర్‌

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలపై హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ ప్లీనరీ, నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపైన దిశానిర్దేశం చేశారు.

ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. ప్లీనరీ, బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలన్నారు. ఈ నెల 27న జరిగే నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు లోపు ఈ సమావేశాలను పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకి ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యచరణ ఉండాలని సూచించారు.

పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతుందని, త్వరలో మరింత పెద్ద ఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందన్నారు. అంతేకాకుండా పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలో చేస్తారని, నవంబర్ 15 బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.

- Advertisement -

ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోయేందుకు సమాయత్తమవ్వాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement