Friday, May 3, 2024

Telangana – 25 మంది వ్యాపారులను కిడ్నాప్ చేసిన మావోయిస్ట్ లు

దుమ్ముగూడెం, ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో మావోయిస్టులు 25 మంది వ్యాపారులను కిడ్నాప్‌ చేశారు.
తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 25 మంది వ్యాపారులు ఉదయం 7 గంటల సమయంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గొల్లపల్లిలో జరిగే వార సంతకు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం, సుక్మా జిల్లాల సరిహద్దులో ఉన్న తాళ్లగూడెం-గొల్లపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద మావోయిస్టులు వాహనాలను అడ్డుకుని వ్యాపారులను కిందికి దింపారు. ఆటోలు, వాహనాల్లోని నిత్యావసర సరకులు, మద్యం సీసాలను బయటకు విసిరేశారు.

వారి సెల్‌ఫోన్లను లాక్కొని అటవీ ప్రాంతాలకు తీసుకెళ్లారు. వారిలో కొందరు మహిళా వ్యాపారులు కూడా ఉన్నారు. నిత్యావసర సరకులు సరఫరా చేస్తూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ కొందరిపై దాడికి పాల్పడ్డారు. అలాంటిదేమీ లేదని తమ వ్యాపారం తాము చేసుకుంటున్నామని, తమను వదిలిపెట్టాలని వేడుకున్నారు.

తమకు వ్యతిరేకంగా పనిచేస్తే చంపుతామని బెదిరిస్తూ వారిని వదిలిపెట్టారు. అదే సమయంలో మరో ఇద్దరు వ్యాపారులు వాహనాల్లో పోలీసులకు సరకులు తీసుకెళుతున్నారు. ముందు వెళ్లిన వారిని మావోయిస్టులు అపహరించారని పసిగట్టిన ఆ వ్యాపారులు తమ వాహనాలను వెనక్కి తిప్పారు. గమనించిన మావోయిస్టులు వారివెంట పడినా తప్పించుకుని వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మావోయిస్టులు కిందపడటంతో గాయాలపాలయ్యారు. తప్పించుకున్న ఇద్దరు వ్యాపారులు పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా మారారని, వారు కనిపిస్తే హతమారుస్తామని హుకుం జారీచేశారు. ఈ ఘటనతో సంత వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement