Saturday, May 4, 2024

కెసిఆర్ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లండి – పార్టీ శ్రేణులకు కెటిఆర్ పిలుపు

హైద‌రాబాద్ – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేలా ప్రయత్నించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు. ఈరోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఒక టెలికాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా గతంలో ఎన్నడూ తీసుకొని విధంగా ఉద్యోగుల పట్ల ఎంతో ఔదార్యంతో తీసుకున్న నిర్ణయాన్ని ఆయా వర్గాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని కేటీఆర్ ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు. తాజాగా 21 వేల మంది వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మానవీయతను చాటుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం వారి పట్ల ప్రభుత్వానికి ఉన్న మానవీయతను చాటి చెబుతుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల ముందర ఆర్టీసీ కార్మికులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు కేటీఆర్ కోరారు.

దీంతోపాటు ఒకటి రెండు రోజుల్లో అటు వీఆర్ఏల కుటుంబాలతోను, ఆర్టీసీ కార్మికులతోను ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ ఇన్చార్జి లకు కేటీఆర్ సూచించారు. కేవలం ఉద్యోగుల పట్లనే కాకుండా రాష్ట్రంలో ఉన్న అనాధల అందరిని ఒక పాలసీ కిందకు తీసుకువచ్చి, వారి బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకునేలా తీసుకున్న నిర్ణయం కూడా అత్యంత మానవీయమైన పరిపాలన నిర్ణయం అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు

ఇక రాష్ట్ర రాజధానిలో ప్రస్తుతం 70 కిలోమీటర్లు ఉన్న మెట్రోను 415 కిలోమీటర్లకు విస్తరించేలా భారీ ప్రణాళికను ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా విస్తరణ తర్వాత మెట్రో అందుబాటులోకి వచ్చే నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మరింతగా బలోపేతం అవుతుందని, నగర విస్తరణకు అనేక సానుకూల అంశాలు ఏర్పడతాయన్న అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. మెట్రో విస్తరణ పూర్తి అయితే హైదరాబాద్ చుట్టుపక్కలున్న సుదూర ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయన్న విశ్వాసాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ఇబ్బందులు పాలైన ప్రజలకు ఉపశమనం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయంగా ప్రకటించిన 500 కోట్ల రూపాయలు ప్రజలకు ఉపయుక్తంగా ఉంటాయన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. అలాగే క్యాబినేట్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లోకి ప్రభుత్వ ఆలోచనలను తీసుకువెళ్లాలని కెటిఆర్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement