Saturday, May 4, 2024

‘పీఎస్‌యూ’లు తిరిగి ప్రారంభించండి.. లేదంటే మా భూములు మాకివ్వండి: కేంద్రానికి కేటీఆర్​ లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూల) అమ్మకం విషయంలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం నిర్మలకు కేటీఆర్‌ ఒక బహిరంగ లేఖ రాశారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెబుతున్న మోడీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజల ఆస్తులను అమ్ముకునే పనిలో మాత్రం బిజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి , ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తెగనమ్ముతోందని కేటీఆర్‌ మండిపడ్డారు తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ధ హామీల అమలునుపట్టించుకోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమపార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్‌ లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార వాణిజ్య పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను తిరిగి ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను తిరిగి ఇచ్చేయాలని కోరారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ఆర్ధికవ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న హిందుస్థాన్‌ కేబుల్‌ లిమిటెడ్‌, హిందుస్థాన్‌ ఫ్లోరో కార్బన్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌, హెచ్‌ఎంటీ, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సీసీఐ), ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్నారు.

గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన 7200 ఎకరాల భూమికి ప్రస్తుతం రూ.40 వేల కోట్లు…

తమ అమ్మకపు ప్రణాళికల్లో కేంద్రం పెట్టిన ఈ ఆరు సంస్థలకు గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయని కేటీఆర్‌ తన లేఖలో గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ప్రకారం కనీసం 5 వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్‌ ధరల ప్రకారం వాటి విలువ 40 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్‌ తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు ప్రభుత్వాలు పలు సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. ఆయా సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేట్‌ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్లుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్‌ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజారవాణా కోసం చేపట్టే స్కై వే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్‌ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూ భాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగసంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పీఎస్‌యూల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్‌ సూచించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్ధరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని సూచించారు. ఇలా చేయకుండా తెలంగాణలోని ఆయా కంపెనీల ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు. తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్‌ లేఖలో కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement