Tuesday, May 7, 2024

TS: తెలంగాణ ఎన్నికల్లో తొలి ఓటు వేసిన 91ఏళ్ల వృద్ధురాలు..

హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో మొట్ట మొదటి ఓటు పోలయ్యింది. ఈనెల 30వ తేదీన పోలింగ్ అయితే అప్పుడే ఓటు వేయడమేమిటి అనుకుంటున్నారా ఈసారి ఎన్నికల్లో చుండూరి అన్నపూర్ణ అనే 91 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు అత్యవసర సర్వీసుల్లో ఉండే ఉద్యోగులు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఎన్నికల సంఘం కల్పిస్తోంది. దీనిద్వారా పోలింగ్ తేదీ కంటే ముందే ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

ఈ ప్రక్రియలో ఇద్దరు ఎన్నికల అధికారులు పోలీసుల సహాయంతో ఓటరు ఇంటికే పోస్టల్ బ్యాలెట్ తీసుకువెళ్లి ఇస్తారు. ఓటరు స్వేచ్ఛగా ఓటు వేసే సౌకర్యాన్ని అదే ఇంట్లో కల్పిస్తారు. ఓటువేశాక దాన్ని కవర్లో పెట్టి ఎన్నికల అధికారికి ఓటరు అప్పగిస్తారు. ఈ ప్రక్రియను వీడియో తీస్తారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రారంభమైన ఈ సదుపాయం ఈనెల 27వరకూ కొనసాగుతుంది. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన ఐదు రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన అన్నపూర్ణ ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఇలా పోలైన పోస్టల్ ఓట్లను పోలింగ్ తేదీ ముగిశాక, అన్ని ఓట్లతో కలిపి లెక్కిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement