Tuesday, May 7, 2024

Political Exclusive – కాంగి”రేస్” కు ష‌ర్మిల బ్రేక్…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ప్రతి ఓటు ప్రతి పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఏ వర్గాన్ని, ఏ కమ్యూనిటీని, చివరకు ఏ వ్యక్తినీ నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అందివచ్చిన చక్కటి అవకాశాన్ని కాంగ్రెస్‌ చేజేతులా చేజార్చుకుందన్న అభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో వైఎస్సార్‌ తెలం గాణ పార్టీ పెట్టారు. ఊరూర పాదయాత్ర చేశారు. మొదట్లో పెద్దఎత్తున ప్రధాన పార్టీలకు పోటీగా దూసుకువచ్చారు. అయితే, కొన్ని కారణాంతరాల వల్ల మధ్యలో ఊపు తగ్గింది. అయినప్పటికీ, వెనుకాడని షర్మిల ప్రధాన రాజకీయ స్రవంతిలోనే ఉన్నారు. అధికార భారాసకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పి కొన్ని వర్గాలను ఆకర్షించగలిగారనడంలో ఆశ్చర్యం లేదు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి తెలంగాణలో ఆయా వర్గాల్లో ఇప్పటికీ అనుకూల పరిస్థితి ఉంది. దీన్ని అందిపుచ్చుకోవడానికి షర్మిల శాయశక్తులా ప్రయత్నించారు.

కాగా, కర్నాటక ఎన్నికల తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్‌ తెలంగాణలో ఊపందుకుంది. భారాసతో పోటీగా నువ్వా నేనా అన్నట్టు ఢీకొంటోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌లోని పాత తరం నాయకులు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలతో టచ్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నచ్చజెప్పారు. అలాగే, కాంగ్రెస్‌కు కూడా లాభిస్తుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్‌కు దెబ్బ అని ప్రచారం చేసింది. పైగా భారాస దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుందని, ఆంధ్రోళ్ల ముసుగులో మళ్లిd తెలంగాణను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం చేస్తారని హెచ్చరించింది. గతంలో కూడా కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు వచ్చినప్పుడు ఇదే ప్రచారంతో గెలిచిన విషయాన్ని పదేపదే ఎత్తి చూపింది. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడింది.


కర్నాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ను కలిసిన షర్మిల కాంగ్రెస్‌ పొత్తు లేదా విలీనానికి సిద్ధమని స్పష్టం చేశారు. ఇదే విషయమై ఆమె ఢిల్లిd వెళ్లి కాంగ్రెస్‌ అధినేతలను కూడా కలిసి చర్చలు జరిపారు. అయితే, ఏకాభిప్రాయం కుదరలేదు. షర్మల పట్ల సానుభూతి చూపినా విలీనానికి కానీ పొత్తుకు కాని కాంగ్రెస్‌ అధిష్టానం ఒక నిర్ణయానకి రాలేకపోయంది. దీనివెనుక పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వర్గం నెరపిన రాజకీయమే కారణమని విశ్లేషకుల అభిప్రాయం. దీంతో షర్మిల ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. తనను నమ్మించి చివరకు జనంలో చులకన చేసే ప్రయత్నం చేశారన్న కసితో షర్మిల ఉన్నారు. ఎన్నికల్లో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా సాధ్యమైనన్ని స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. షర్మిల పార్టీ వల్ల ప్రధానంగా కాంగ్రెస్సే నష్టపోనుందని వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాతతరం నేతల్లో ఈ అభిప్రాయం బలంగా ఉంది. వైఎస్సార్‌ సానుభూతిపరుల ఓట్లతో పాటు వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ రంగంలోకి దిగడమే కాకుండా ఏకంగా తాను కూడా బరిలోకి దిగుతున్నారు. అలాగే, క్రైస్తవుల్లో విశేష పలుకుబడి ఉన్న షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌ కూడా అసెంబ్లిd బరిలో దిగుతున్నారు. ఈ పరిణామం ఇప్పుడు విశేష ప్రాధాన్య అంశంగా మారింది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో షర్మిల పార్టీ కచ్చితంగా ఓట్లు చీలుస్తుందని, ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతరేక ఓట్లేనన్నది నిర్వివాదాంశం.

వైఎస్సార్‌ అభిమానులు, ఆ పార్టీ సామాజికవర్గం వారు, క్రైస్తవులు… ఇలా ప్రతి కమ్యూనిటీలోనూ షర్మిల పార్టీకి ఓట్లు పడనున్నాయి. దీంతో వెయ్యి నుంచి మూడు వేల ఓట్ల తేడాతో గెలుపోటములను నిర్ణయించే నియోజకవర్గాల్లో షర్మిల పార్టీ ఆయా అభ్యర్థుల భవిష్యత్తును కచ్చితంగా నిర్దేశిస్తుందని కాంగ్రెస్‌ నేతలతో పాటు అన్ని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. కొందరు నేతల అహంకారానికి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పెద్ద మూల్యాన్నే చెల్లించుకునే పరిస్థితి దాపురిస్తోందని పార్టీలో పాతతరం నేతలు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement