Saturday, July 27, 2024

Ordered – అయోధ్య బాల రామ‌య్య‌కు దుబ్బాక వ‌స్త్రం – లినెన్‌ ఇక్కత్‌ చేనేతకు ఆర్డ‌ర్‌

సిద్దిపేట జిల్లా దుబ్బాక చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వ‌స్త్రాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్ర్తాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు అర్డర్‌ను అందుకున్నారు. దుబ్బాకలో ఏర్పాటైన దుబ్బాక హైండ్ల్యూస్‌ కంపెనీలో తయారైన లినెన్‌ ఇక్కత్‌ చేనేత వ‌స్త్రాన్ని (పింక్‌ కలర్‌) అయోధ్య రాముడికి ఆదివారం అలంకరించారని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బోడ శ్రీనివాస్‌ తెలిపారు. అయోధ్య రాముడి అలంకరణకు తాము తయారు చేస్తున్న లినెన్ వ‌స్త్రాలు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.

రెండు రంగుల‌లో రెండు డిజైన్లు
సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వ‌స్త్రాల‌ను రాముడికి అలంకరించేందుకు ఢిల్లీకి చెందిన డిజైనర్‌ మనీశ్‌త్రిపాఠి ఎంపిక చేస్తారని ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లినెన్‌ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్‌ ఇచ్చారని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్‌ లినెన్‌ ఇక్కత్‌ వస్రాలను అందించడం జరిగిందన్నారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు.

- Advertisement -

ఆదివారం పింక్‌ కలర్..
శ్రీరాముడికి ఆదివారం పింక్‌ కలర్ వ‌స్త్రాన్ని అలంకరణ చేసే నిబంధన ఉండటంతో తాము తయారు చేసిన వ‌స్త్రాన్ని అలంకరించినట్లు డిజైనర్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమాచారం అందించారన్నారు. మరో ఐదు రోజులకు ఐదు డిజైన్లతో కూడిన వ‌స్త్రాల‌ను తయారు చేసి అందజేయనున్నట్లు చైర్మన్‌ బోడ శ్రీనివాస్‌ తెలిపారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతీయ స్థాయిలో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాసత్‌ పేరిట చేనేత చీరల ప్రదర్శనలో దుబ్బాకలో తయారైన లినెన్‌ చీరకు స్థానం దక్కి దుబ్బాక చేనేత కార్మికులు ప్రశంసలు పొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement