నిజాంబాద్ జిల్లాలో ఇవ్వాల ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ జాతీయ రహదారిపై వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.. ఆదివారం అర్ధరాత్రి దాటాక సుమారు 1:30 గంటల సమయంలో ఆగి ఉన్న లారీని మెట్ పల్లి వైపు నుండి వస్తున్న ఆల్టో (TS21B 6446) కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఎస్ఐ వినయ్ తెలిపారు.
కారు, లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అందులో ఉన్న మెట్పల్లి కి చెందిన ఇద్దరు వ్యక్తులు అనిల్ (26), సుమన్ (25) సజీవ దహనం అయినట్టు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డి, వేల్పూర్ ఎస్సై వినయ్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.