Saturday, July 27, 2024

పారిశుధ్య కార్మికుల‌కు మేయ‌ర్ సత్కారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి సన్మానించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మేయర్ మొక్కలు నాటారు. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా తనకు తెలపాలని, తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని మేయర్ కార్మికులకు తెలిపారు.

మహిళా పారిశుధ్య కార్మికులు పనిచేసేచోట వేధింపులకు గురైతే ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోవద్దని, అలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలంటే దైర్యంగా తనకు తెలపాలన్నారు. వేధింపులకు గురిచేసే వారిపై చర్యలు తీసుకుని, న్యాయం చేస్తానని మేయర్ వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, జీహెచ్ఎంసి సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement