Monday, April 29, 2024

TS | ప‌దేళ్ల‌లో తెలంగాణ‌కు బీజేపీ చేసిందేమిటి? : హ‌రీష్ రావు

కొడంగ‌ల్ : ప్రజల కష్టాల గురించి రాస్తున్న ఇక్కడి కొడంగల్ జర్నలిస్టులకు బెదిరింపులు వస్తున్నాయన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల హామీల అమలుకు పోరాడాల్సిన బాధ్యత మన పైన ఉంది అని తెలిపారు. ఓడినా, గెలిచినా మనం ప్రజల వైపే ఉంటాం.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి వంద పథకాలను అమలు చేసింది.. మరి బీజేపీ చేసిందేమిటి? అని ఆయన ప్రశ్నించారు.

కొడంగల్ కోస్గిలో నిర్వహించిన మహబూబ్ నగర్ పార్లమెంటు ఎన్నికల బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచింది అని పేర్కొనింది. 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి 6 లక్షలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది.. చెప్పుకోడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, అక్షింతలు, చీరలు పంచున్నారు అని హరీష్ రావు అన్నారు.

తెలంగాణకు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, నవోదయ స్కూళ్లు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపింది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు.. కరువు కాటకాలతో అల్లాడే ఈ ప్రాంతానికి కేసీఆర్ నీళ్లిచ్చిండు.. ఆరు నెలల్లో పూర్తి కావాల్సిన కరివేన ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ ప్రభుత్వం టెండర్లు రద్దు చేసింది అని ఆయన ఆరోపించారు.

ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా అమలు చేయలేదు.. సీఎం నియోజకవర్గంలోనే 2 లక్షల రుణమాఫీ కాలేదు.. రైతులకిచ్చిన 15 వేల రైతు బంధు, వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇవ్వలేదు.. రైతులు చేసేదేం లేక 1700 రూపాయలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ రైతులకు ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిండు.. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బీమా, రైతుబంధు ఇచ్చిండు అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

ఆసరా పింఛన్ 4 వేల రూపాయలు ఇస్తామని రేవంత్ అవ్వాతాతలను కూడా మోసం చేసిండు అని హరీష్ రావు చెప్పారు. నెలకు 2500 రూపాయలు ఇస్తామని మహిళలను మోసం చేసిండు.. కాంగ్రెస్ ఓట్లడగడానికి వస్తే నాలుగు నెలలకు కలిపి 10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు.

- Advertisement -

నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని వాళ్లనూ మోసం చేసిండు రేవంత్.. అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు.. కల్యాణ లక్ష్మీ కింద ఆడ పిల్లలకు తులం బంగారం ఇస్తామని అదీ ఎగ్గొట్టిండు.. కేసీఆర్ కిట్లు బంద్ అయినవి, తిట్లు స్టార్ట్ అయినవి.. కొత్త పథకాలు లేవు.. కోత పథకాలు వస్తున్నాయ్ అని ఆయన ఆరోపణలు గుప్పించారు.

హామీలు అమలు చేయడం చేతకాక ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు.. రైతులు, పేదలు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది.. హకీంపేట, ఎర్రంపల్లి లాంటి నాలుగు గ్రామాల రైతుల భూములను ఫార్మా కంపెనీ కోసం లాక్కుంటున్నారు.. పొల్యూషన్ కంపెనీ మాకొద్దని ప్రజలు అంటున్నారు.. మేం రైతులకు అండగా ఉండి పోరాడతాం.. కాంగ్రెస్ మెడలు వంచి హామీలను అమలు చేయాలంటే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేసి మన్నె శ్రీనివాస్ రెడ్డిని గెలిపించుకవాలి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement