Monday, April 29, 2024

Kishan Reddy: ఓటు హక్కు వినియోగించుకున్న కిషన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అంబర్ పేట బర్కత్‌పురలోని పోలింగ్ కేంద్రానికి సతీసమేతంగా వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో ఎన్నికలు గొప్పగా, పండుగలా జరుపుకుంటామని తెలిపారు. తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నట్లు చెప్పారు.

ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ విధానాన్ని విమర్శించే ముందు ఓటు హక్కు ముఖ్యమైనదని, ఓటు వేయకుండా ఎవరిని విమర్శించే అవకాశం రాదన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చి డబ్బు, మద్యం ప్రభావంతో ఓట్లను కొనాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందని, నచ్చిన వ్యక్తిని ఆలోచించి ఎన్నుకోవాలన్నారు. ఎవరికి భయ పడకుండా ఓటు వేయాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement