Sunday, May 19, 2024

TS | పూరీలు వేస్తూ, ఓట్లు అడుగుతూ.. ఎమ్మెల్యే చందర్ వినూత్న ప్రచారం

పూరీలు వేస్తూ.. ఛాయ్ తయారుచేస్తూ మీ సింగరేణి బిడ్డ నే అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామునే గోదావరిఖని పట్టణంలోని బస్టాండ్ సమీపంలో చిరు వ్యాపారులను ఆత్మీయంగా పలకరిస్తూ మరోసారి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ కెసిఆర్ భరోసా యాత్ర పేరిట ప్రతి గడపకు వెళ్లి బిఆర్ఎస్ మేనిఫెస్టోను తెలియజేస్తున్నామన్నారు.

గత పాలకుల హయాంలో నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఐదు ఏళ్లలో 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపానన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. రామగుండం ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి మెడికల్ కళాశాల ఏర్పాటు చేశామన్నారు.

కాంగ్రెస్ ఓట్ల రాజకీయం చేస్తుందని, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలు చేస్తామని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. వాళ్లు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు .6 గ్యారంటీలు కాదు 60 గ్యారంటీలు పెట్టినా చెయ్యికి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

బిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం చేపట్టగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందించడంతోపాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుతుందన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛన్లు 6000 రూపాయలకు పెంచుతారన్నారు. ప్రచారంలో భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement