Tuesday, May 7, 2024

KNR: ప్రజా పాలనకు అద్భుతమైన స్పందన.. నోడల్‌ అధికారి

ఎలిగేడు, జనవరి 6 (ప్రభన్యూస్‌): ఆరు గ్యారెంటీ పథకాలను అర్హులందరికీ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అద్బుతమైన స్పందన వస్తోందని ప్రజా పాలన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నోడల్‌ అధికారి శ్రీదేవసేన అన్నారు. శనివారం ఎలిగేడు మండలంలోని లాలపల్లి గ్రామంలో చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజా పాలనలో దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారు దరఖాస్తు చేసుకున్న పథకాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని, జిల్లా కలెక్టర్‌ గా రెండేళ్లపాటు తాను పనిచేయడం తన కెరియర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజల నుంచి అద్భుతమైన ప్రేమ, సహకారం తనకు లభించాయని గతంలో కలెక్టర్‌గా చేసినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.

అలాగే గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలకు అందజేసే దిశగా దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్‌ వార్డుల్లో సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని, ప్రజా పాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించిందని, గ్యారంటీ పథకాలపై మంచి అవగాహనతో ప్రజలు వారికి అవసరమైన పథకాలకు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 6తో కార్యక్రమం ముగిసినా ఇక నుంచి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను ఆన్‌ లైన్‌ పోర్టల్‌లో నమోదు చేసి, నిర్దిష్ట ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులను ఎంపిక చేసి పథకాలను అమలు చేస్తామన్నారు.

మహిళల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందని, మహిళల కోసమే ప్రత్యేకంగా రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, నెలకు రూ.2500 సహాయం వంటి గ్యారెంటీ పథకాలను చేపడుతుందన్నారు. ప్రజా పాలనకి సైతం మహిళల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్‌ సిద్దిపేటలో అద్భుత పనితీరు కనబరిచారని, వారి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో స్వచ్ఛత పారిశుద్ధ్య అంశంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించి పెద్దపల్లి జిల్లాకు జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు రావాలని ఆకాంక్షించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ జే.అరుణశ్రీ నోడల్‌ అధికారి శ్రీదేవసేనకు ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ప్రజలకు పథకాలను అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగమే గ్రామాల్లో ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తుల స్వీకరిస్తున్నామన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో సమర్పించిన దరఖాస్తుల్లో ప్రతి పథకానికి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ప్రకారం అర్హులకు అమలు చేస్తామన్నారు. నూతన రేషన్‌ కార్డుల కోసం సైతం ప్రజాపాలన కార్యక్రమంలో తెల్ల కాగితంపై దరఖాస్తు సమర్పించాలని, రేషన్‌ కార్డు దరఖాస్తులు, ఇతర దరఖాస్తుల సమర్పణ కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. గ్యారెంటీ పథకాల అమలు, ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పించ వచ్చని, ప్రజలు వారి పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకు వచ్చి వారి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ.. రాబోయే ఐదేళ్లలో ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, దశల వారీగా అర్హులకు లబ్ధి చేకూరుతుందని, ముందు వరుసలో అత్యంత నిరుపేదలకు ఇండ్ల మంజూరు ఉంటుందన్నారు. గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు సమర్పించే సమయంలో తప్పనిసరిగా ఇంటి మీటర్‌ నెంబర్‌ నమోదు చేయాలని తెలిపారు.

మహాలక్ష్మి పథకం క్రింద అర్హులైన మహిళలందరికీ నెలకు 2500 రూపాయల సహాయం చేయడం జరుగుతుందని, 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేస్తామని, మహిళలు తమ గ్యాస్‌ సిలిండర్‌ కంపెనీ పేరు, గ్యాస్‌ నెంబర్‌ నమోదు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. రైతు భరోసా కార్యక్రమం కింద రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం చేస్తామని దీనికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని, చేయూత కార్యక్రమం క్రింద పెన్షన్దారులకు 4000 పెన్షన్‌ మంజూరు చేస్తామని, నూతన పించన్‌ దారులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అభయ హస్తం గ్యారెంటీ పథకాల అమలులో ఎట్టి పరిస్థితిలో అవినీతికి ఆస్కారం ఉండదని, ప్రభుత్వ పథకాలను అర్హులకు దశల వారీగా పారదర్శకంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీధర్‌, జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతి రావు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, సింగిల్‌ విండో చైర్మన్‌, జడ్పిటిసి, ఎంపిటిసి, గ్రామ సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి ఎన్‌.శిరీష, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement