Sunday, April 28, 2024

TS : నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు.. ప్రతీ కేంద్రంలో నిఘా…

ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అధికారులు ఇంటర్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు దశల్లో ప్రాక్టికల్స్‌, పర్యావరణ విద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. నేటి నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు.

జిల్లాలోని 58 కళాశాలల్లో 16 ప్రభుత్వ కళాశాలలు కాగా, 18 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. మిగిలినవి కస్తూర్బా, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ కళాశాలలు. ఇందులో 13,175 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,507 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,668 మంది ఉన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, ప్రభుత్వ రంగ మోడల్ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, గిరిజన గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలతో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించారు.

- Advertisement -

ఈ పరీక్షల కోసం దాదాపు 700 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. సీసీ కెమెరాల నిఘాలో ప్రత్యేక అధికారులు పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రాలను విడుదల చేస్తారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీమ్‌లు, 5 కస్టోడియన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసి ఉంచాలని పోలీసు శాఖ ఆదేశించింది. పరీక్షలు ఈ నెల 28న ప్రారంభమై మార్చి 19న ముగుస్తాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఉదయం 9 గంటల తర్వాత అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement