Wednesday, May 1, 2024

TS: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు గ‌ల్లంతే… ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి

హైద‌రాబాద్ – అసెంబ్లీలో ఘోర ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న బీఆర్ఎస్ కు లోక్ స‌భ ఎన్నిక‌ల‌లోనూ శృంగ‌భ‌గం తప్ప‌ద‌న్నారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.. తప్పుడు ప్రచారంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఆ మాత్రం ఓట్లయినా పడ్డాయని వ్యాఖ్యానించారు. గాంధీ భవన్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… కేటీఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటపడాలని హితవు పలికారు. కేటీఆర్ అందులోంచి బయటకు రాకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు పరోక్ష మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఇప్పటికే కాచుకొని కూచుందన్నారు. కేసీఆర్ హయాంలో ప్రచారం తప్ప బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. అందుకే ఓడిపోయారని అయినా వారికి జ్ఞానోదయం కలగడం లేదన్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో కారుకు డిపాజిట్లు గల్లంతే….

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా దక్కవన్నారు జీవ‌న్ రెడ్డి. బీఆర్ఎస్ తన అభ్యర్థులను మార్చితే సరిపోదన్నారు. ఆ పార్టీ అధినాయకుడిని మార్చడానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌న్నారు. గిరిజనులను గత ప్రభుత్వం నిండా ముంచిందని, అందుకే వారు కాంగ్రెస్ వైపునకు వచ్చారని పేర్కొన్నారు. దళితబంధు, బీసీబంధు అంటూ ఎన్నికలకు ముందు హడావుడి చేశారని, దీనిని ప్రజలు గుర్తించారన్నారు. మిషన్ భగీరథలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ పెద్ద బోగస్ అని… కమీషన్ల కోసమే అలా చేశారని ఆరోపించారు. ఇప్ప‌టికే ప్రారంభ‌మైన విచార‌ణ‌లో దోషులు తెలితే ఆ పార్టీ నేత‌లు జైలుకు పోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement