Sunday, April 28, 2024

Special Story – ఊపిరి అంద‌ని రాజ‌ధాని! ఎయిర్ క్వాలిటీ వేరీ పూర్‌!

హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌
ప్రమాదపుటంచుక రాజధాని నగరం
పారిశ్రామిక వాడల్లో అనూహ్య మరిణామాలు
వాయు, జల, ధ్వని కాలుష్యాల్లో మితిమీరుతున్న ప్రమాణాలు
నానాటికీ విషతుల్యమవుతున్న శివారు ప్రాంతాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమానాల కంటే 14 రెట్లు అధికం
నిర్లక్ష్యం చేస్తే ఢిల్లీని మించిపోయే ప్రమాదం
గాలి నాణ్యత కోల్పోతున్న వందలాది గ్రామాలు
తాజా అధ్యయనంలో వెలుగుచూసిన ఆందోళనకర అంశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్ సిటీలో ఏటేటా వాయు కాలుష్యం పెచ్చు పెరిగిపోతోంది. దక్షిణ భారత దేశంలోని మెట్రో నగరాల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా వాయు కాలుష్యం ఉందని ఇటీవల గ్రీన్‌ పీస్‌ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలోనే 2.5 పీఎం పది కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న ప్రమాణాల కంటే 14 రెట్లు అధికంగా మన నగరంలో కాలుష్యం విడుదల అవుతోంది. వరల్డ్‌ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లోనూ కాలుష్య నగరాల జాబితాలో మహానగరం చేరడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరిగింది. బంజారాహిల్స్‌లో వాయుకాలుష్యం 127 ఏక్యూఐ, కేపీహెచ్‌బీలో 124, పాతనగరం జూపార్కు ప్రాంతంలో 144, సైదాబాద్‌లో 110 ఏక్యూఐకి చేరింది. పారిశ్రామికవాడలున్న మల్లాపూర్‌, నాచారం, బాలానగర్‌, పటాన్‌చెరు, పాశమైలారం, చర్లపల్లి ప్రాంతాల్లో వాయు కాలుష్యం అనూహ్యంగా పెరిగిపోతోంది.

ఇవిగో.. కాలుష్యానికి కారకాలు!

సరాసరిగా ప్రతినిత్యం హైదరాబాద్‌ నగరంలో ఉదయం 8.30 గంటలకు వాయు కాలుష్యం 158 ఏక్యూఐకి చేరిందని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కాలుష్యం పెరగడానికి పలు కారణాలున్నాయి. వాహనాల ఉద్గారాలు, భవన నిర్మాణ కార్యకలాపాలు, కర్మాగారాలు వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. గాలిలో నైట్రోజన్‌ డై ఆక్స్‌డ్‌ ఎక్కువగా ఉంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలున్నాయి. ఆర్థిక రాజధాని ముంబయి కంటే కూడా హైదరాబాద్ సిటీలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉందని తేలింది.

వ‌ర‌ల్డ్ టాప్ మోస్ట్ జాబితాలో హైద‌రాబాద్‌

ప్రపంచ కలుషిత మెట్రో నగరాల జాబితాలోకి హైదరాబాద్‌ చేరింది. నగరంలో రోజుకు 7వేల మెట్రిక్‌ టన్నుల చెత్త విడుదల అవుతోంది. ఈ చెత్త వల్ల కూడా కాలుష్యం పెరిగిపోతోంది. నగర శివార్లలో డంపింగ్‌ యార్డు నుంచి తీవ్ర దుర్గంధం వెలువడుతోంది. విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగరంలో జనాభాతో పాటు వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే 70 లక్షలకు పైగా వాహనాలున్నాయి. వాహనాల కాలుష్యంతోపాటు.. భవనాలు, రోడ్ల నిర్మానాల వల్ల కూడా వాయు కాలుష్యం ఏర్పడుతోంది. వచ్చే పదేళ్లలో నగరంలో కాలుష్యం పెరిగి ముక్కు మూసుకొని జీవనం గడిపే పరిస్థితులు ఏర్పడనున్నాయి.

- Advertisement -

పరిశ్రమల నుంచి కలుషిత వాయువులు..

నగర శివార్లలోని పటాన్‌ చెరు, పాశమైలారం, మియాపూర్‌, కాజుపల్లి, ఐడీఏ బొల్లారం, బాచుపల్లి, జీడిమెట్ల, బాలానగర్‌, మల్లాపూర్‌, నాచారం, మౌలాలీ, చర్లపల్లి ప్రాంతాల్లోని కాలుష్య కారక పరిశ్రమలను అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు బయటకు తరలిస్తామని ప్రభుత్వం చెప్పినా.. ఇంకా అమలు కాలేదు. పరిశ్రమల నుంచి వాయు కాలుష్యం నగరానికి వ్యాపిస్తోంది. పరిశ్రమల నుంచి కలుషిత వాయువులు వెలువడ‌డంతో గాలి నాణ్యత తగ్గుతోంది. కెమికల్‌ పరిశ్రమల వల్ల భూగర్భ జలాలు, జలవనరులు కలుషితం అవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థ జలాలు, మురుగునీరు హుసేన్‌ సాగర్‌, మూసీ నదుల్లో కలుస్తుండటంతో అవి కూడా కాలుష్య కాసారాలుగా మారాయి. బోరుబావుల్లో నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన వస్తోంది.

ఉల్లంఘనలపై ఫిర్యాదులు..

గాలి కాలుష్యంతో సోషల్‌ మీడియా, ఆన్‌ లైన్‌ ద్వారా కూడా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. ఈ ఫిర్యాదులను పరిశీలించేందుకు 24 గంటల పాటు మానిటరింగ్‌ సెల్‌ ఉంది. ఫిర్యాదులపై మానిటరింగ్ టీమ్‌, క్విక్‌ రియాక్షన్ టీమ్‌, రీజనల్‌ ఆఫీసర్లు, టాస్క్‌ ఫోర్స్ టీమ్‌లు వెళ్లి గాలి నాణ్యతను పర్యవేక్షిస్తుంటాయి. హైదరాబాద్‌ నగరంలో కాలుష్య ఫిర్యాదులపై 77 పరిశ్రమలను టీఎస్‌ పీసీబీ అధికారులు ఫిబ్రవరి నెలలో తనిఖీలు చేశారు. హైదరాబాద్‌ నగరంతోపాటు తెలంగాణలోని మల్లాపూర్‌, జీడిమెట్ల, గడ్డపోతారం, బొంతపల్లి, పటాన్‌ చెరు, తక్కళపల్లి, వాడపల్లి, పిట్టంపల్లి, గుమ్మడిదల, చౌటుప్పల్‌, నందనం, కుషాయిగూడ, చెట్లగౌరారం, మణుగూరు, హయత్‌ నగర్‌, బీబీనగర్‌, బొమ్మలరామారం, మేడ్చల్‌ దేవాపూర్‌, మారేపల్లి, ఇస్నాపూర్‌, మహేంద్రనగర్‌, పాల్వంచ, దుండిగల్‌, కవాడిపల్లి, నారాయణగిరి, చిలకమర్రి, పెద్దకాపర్తి ప్రాంతాల పరిశ్రమల్లో పీసీబీ అధికారులు నిరంతర తనిఖీలు చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ ఫిర్యాదులకు జనవాణి..

పలు కంపెనీల్లో నిర్ణీత ప్రమాణాల కంటే అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని పీసీబీ అధికారులు తేల్చారు. వాయు కాలుష్యంపై ఆన్‌ లైన్‌ ఫిర్యాదుల కోసం కాలుష్య నియంత్రణ మండలి జనవాణి కాలుష్య నివారిణి పేరిట యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. పరిశ్రమల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంపై ప్రజలు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. నగరంలోని కాలనీ సంక్షేమ సంఘాలు కాలుష్యంపై ఫిర్యాదులు సమర్పించాయి. మల్లాపూర్‌, నాచారం కాలుష్య కారక పరిశ్రమలపై తాము పీసీబీకి ఆయా పీడిత ప్రాంతాల సంక్షేమ సంఘాలు ఫిర్యాదు చేశాయి. వీటిపై స్పందిస్తూ కాలుష్య నియంత్రణ అధికారులు దర్యాప్తు మొదలు పెట్టారు.

పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..

కాలుష్యం వల్ల నగర ప్రజలు శ్వాసకోశ వ్యాధుల పాలవుతున్నారు. కలుషిత వాయువుల వల్ల కళ్లు, ముక్కు మండుతూ ప్రజలకు చికాకు కల్పిస్తున్నాయి. దీనివల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటున్నాయి. కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్‌ బారిన పడటంతోపాటు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. నగరంలోని హుస్సేన్‌ సాగర్‌ సరస్సు నీటి నాణ్యతలో క్షీణించిందని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో తేలింది. సరస్సు కాలుష్య కాసారంగా మారడంతో సాగర్‌ చుట్టూ ఉన్న నెక్లెస్‌ రోడ్డుపై వాయుకాలుష్యం పెరిగింది. సాగర్‌ నీటిలో మల కోలిఫారమ్‌తో సహా బ్యాక్టీరియా, హానికరమైన వ్యర్థాలు పెరిగాయని పీసీబీ తేల్చి చెప్పింది. మూసీలో కూడా మురుగునీరు చేరుతుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి చొరవ తీసుకొని మూసీ అభివృద్ధి ప్రాజెక్టు చేపట్టారు. నీటి నాణ్యతను మెరుగుపర్చడానికి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు పనిచేస్తున్నా కాలుష్యం తగ్గడం లేదు. బంజారా నాలా నుంచి మురుగునీటి వ్యర్థాలు సాగర్‌లో కలుస్తున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం శిరోధార్యం..

కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం శిరోధార్యంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర కాలుష్య మండలి తాజాగా ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. హైదరాబాద్‌ నగరంలో వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతున్నందున దీనికి తెర వేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు వాడాలని సూచించింది. నగరంలో జనసాంద్రత పెరగడంతోపాటు- కాలుష్యం ఏ రోజు కారోజు పెరుగుతుందని, దీన్ని నివారించడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. ఇటీ-వల నగరంలో మల్టీస్టోరేజ్‌ భవనాల నిర్మాణం వల్ల దుమ్మూ, ధూళి పలు ప్రాంతాల్లో పెరుగుతుందని పీసీబీ ఆందోళన వ్యక్తం చేసింది. పొగ అయితే గొట్టం ద్వారా పైకి పోతుందని, నిర్మాణరంగం ద్వారా వెలువడే వ్యర్థాలు గాలిలో వ్యాపించి వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని నివేదికలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement