Friday, May 17, 2024

పద్మ పురస్కార గ్రహీతలకు సన్మానం, డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర దంపతులకు నామా అభినందనలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప‌ద్మ అవార్డు గ్ర‌హీత‌లు డాక్టర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా తెలుగు వార‌వ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత‌, ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌రరావు హర్షం వ్యక్తం చేశారు. సామాన్య రైతు కుటుంబంలో జ‌న్మించి, ఫార్మారంగంలో అసామాన్య స్థితికి వారు చేరుకున్నార‌ని అన్నారు. బుధ‌వారం డాక్ట‌ర్ కృష్ణ ఎల్లా, సుచిత్ర దంప‌తుల‌ను టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఘ‌నంగా స‌న్మానించారు. వీరిద్దరూ ఈనెల 28న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా నామా నాగేశ్వ‌రరావు మాట్లాడుతూ… కృష్ణ మాదిరిగానే తాను కూడా రైతు కుటుంబంలో జన్మించాన‌ని, తాము ఎంచుకున్న రంగాలు, ప్రాధాన్యతలు వేరైనప్పటికి ప్రజా సేవ చేయాలనే బలమైన ఆకాంక్షతో ప్ర‌జ‌ల ముందున్నామని చెప్పుకొచ్చారు.

ఆయన హెపటైటిస్ బీ సహా ఎన్నో వ్యాధులకు టీకాలు కనిపెట్టారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ కనుగొనడంలో ఆయన పాత్ర కీలకమ‌ని తెలిపారు. కోవాగ్జిన్ వంటి టీకా తయారు చేసి భారత్‌ను అగ్రదేశాల సరసన నిలిపారని సంతోషం వ్యక్తం చేశారు. మనదేశం నుంచి వచ్చిన, పూర్తి స్వదేశీ టీకా కోవాగ్జిన్ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ గుర్తింపుతో పాటు ఎన్నో దేశాల్లో ప్రజలను కాపాడిందని అన్నారు. భారత్ బయోటిక్‌ను స్థాపించి ప్రపంచంలోనే ఒక అగ్రగామి ఫార్మాసంస్థగా నిలపడంలో ఆయన కృషి మరువలేనిదని ఎంపీ నామా వివరించారు. త‌న మిత్రడు ఇన్ని విజయాలను సాధించింనందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement