Sunday, May 5, 2024

Gaddar RIP – ప్ర‌జా వాగ్గేయ‌కారుల శ‌కం ముగిసింది…రాజకీయ, సినీ ప్ర‌ముఖుల సంతాపం …

అమరావతి : ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి పట్ల ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి అని కొనియాడారు. గద్దర్‌ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే తన గొంతుకగా వినిపించారని పేర్కొన్నారు. మొత్తంగా తెలుగు జాతి గద్దర్‌కు సెల్యూట్‌ చేస్తోందని అన్నారు. అతడి కుటుంబ సభ్యులకు అందరూ బాసటగా ఉందామని వెల్లడించారు.

ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోశారు: చంద్రబాబు

తన పాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అని కొనియాడారు. తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో, పౌర హక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసినట్టయిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో గద్దర్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుకుంటున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.

“ప్రజా యుద్ద నౌక” మరణం తీవ్ర విషాదం – పవన్ కల్యాణ్

ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు, “ప్రజా యుద్ద నౌక” శ్రీ గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం.. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా @JanaSenaParty @pawankalyan
తరపున నివాళులు అర్పిస్తున్నాం.

- Advertisement -

గద్దర్ అమర్ రహే..
“ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకు జోహార్… ఉద్యమ గీతానికి జోహార్… గద్దర్ అమర్ రహే” అంటూ లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.

నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం: రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి … ‘‘ నీ గానం… తెలంగాణ వేదం. నీ గజ్జె… తెలంగాణ గర్జన. నీ గొంగడి… తెలంగాణ నడవడి. నీ గొంతుక… తెలంగాణ ధిక్కార స్వరం. నీ రూపం… తెలంగాణ స్వరూపం. గద్దరన్నా… నువ్వు నా జీవిత కాల జ్ఞాపకం. నీ మరణం… నా గుండెకు శాశ్వత గాయం’’.

ఆయ‌న‌ గళం అజరామరం – చిరంజీవి

వారి గళం అజరామరం, ఏ పాట పాడినా దానికో ప్రయోజనం ఉండేలా గొంతెత్తి పోరాడిన ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దరన్నకు లాల్ సలాం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తి రగిలించారని కొనియాడారు. అలాంటి గద్దరన్న ఇక లేరన్న వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసిందని పేర్కొన్నారు. ప్రజాసాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ భర్తీ చేయలేనిదని, పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుందని చిరంజీవి వివరించారు. గద్దరన్న కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు: బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ .. ‘‘ తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలు నడిపించిన విప్లవకారుడు, ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. గద్దర్ ఓ విప్లవశక్తి. ప్రజా ఉద్యమ పాటలంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మన గద్దర్ గుర్తుకు వస్తారు. ప్రజా ఉద్యమాల్లో గద్దర్ లేని లోటును ఎవ్వరు తీర్చలేరు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’.

ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది: ఆర్ నారాయణమూర్తి
‘‘ ఒక అన్నమయ్య పుట్టారు..దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు… దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు… దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు… దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది’’.

Advertisement

తాజా వార్తలు

Advertisement