Wednesday, May 1, 2024

అందుబాటులో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు.. ఉచిత ప్ర‌యాణం

ఇటీవ‌ల రూ.12.96కోట్లు ఖ‌ర్చుపెట్టి ఆరు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను కొనుగోలు చేసింది హెచ్ ఎండీఏ. కాగా హైదరాబాద్ లోని పలు పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రకటించింది. కాగా ఈ బస్సులు ఏ రూట్ లో తిరుగుతున్నాయనే విషయంపై స్పష్టత లేక వీటికి ఆదరణ లభించడంలేదు. ఈ నేపథ్యంలో బస్సులు తిరిగే రూట్లను హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ట్విట్టర్ లో వెల్లడించారు. నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చేలా ప్రత్యేక రూట్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు.

బిర్లామందిర్, అసెంబ్లీ, సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, మక్కా మసీద్, తారామతి బారాదరి, గోల్కొండ, గండిపేట పార్కు, దుర్గం చెరువు, తీగల వంతెన, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల ను చుట్టొచ్చేలా డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం ట్యాంక్ బండ్ నుంచి డబుల్ డెక్కర్ బస్సులు బయలుదేరి తిరిగి ట్యాంక్ బండ్ కు చేరుకుంటాయి. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ కోసం ఖైరతాబాద్, ఎస్టీపీ, సంజీవయ్య పార్కులో ప్రత్యేక ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.డబుల్ డెక్కర్ బస్సుల్లో కొన్నిరోజుల పాటు ఉచితంగానే ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ఆపై కనీస ఛార్జీగా ఒక్కో ట్రిప్పునకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున వసూలు చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారి ఒకరు తెలిపారు. టికెట్ ధర, ఎప్పటి నుంచి అందుబాటులోకి తేవాలనేది ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. పర్యాటకుల స్పందనను బట్టి మరికొన్ని రూట్లలో కూడా డబుల్ డెక్కర్ బస్సులను తిప్పేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించారు.ఈ అవ‌కాశాన్ని ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement