Tuesday, May 28, 2024

BRS Party – మంచి చేశాం…చెప్పుకోలేక‌పోయాం…అందుకే ఓడిపోయాం.. కెటిఆర్


కాంగ్రెస్ అబ‌ద్దాల హామీల‌నే ప్ర‌జ‌లు న‌మ్మారు
ఇప్ప‌డు ప్ర‌జ‌లు బాధ‌ప‌డుతున్నారు..
హామీల‌న్నీ అట‌కెక్కించిన రేవంత్ పై కోపంతో ఉన్నారు
ఈ ఎన్నిక‌ల‌లో బిఆర్ఎస్ అభ్య‌ర్ధిని గెలిపించి
కాంగ్రెస్ స‌ర్కార్ కు బుద్ది చెప్పాలి
న‌ర్సంపేట ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో కెటిఆర్

త‌మ‌ ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన మంచి ప‌నులు చెప్పుకోలేక.. స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించి కూడా యువ‌త‌కు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు పెంచి కూడా వారికి దూర‌మ‌య్యామ‌న్నారు.. చేసింది చెప్పుకోలేక ఓడిపోయామ‌న్నారు . న‌ర్సంపేట‌లో ఏర్పాటు చేసిన వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో కేటీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగిస్తూ, రైతు రుణమాఫీ విషయంలో ఒకసారి నమ్మినందుకు రైతాంగాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పారు. ఇప్పుడు ఆగస్టు 15 లోగా రైతుల రుణాలు మాఫీ చేస్తామంటూ మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ నమ్మితే మోసపోవడం తప్పదని, అప్పుడు తప్పు కాంగ్రెస్ వాళ్లది కాదు, వాళ్ల హామీలను నమ్మిన మనదేనని చెప్పారు.

- Advertisement -

ఆరు నెలల కిందట రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందనేది జాగ్రత్తగా గమనించాలంటూ రాష్ట్ర యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు. అప్పటికి, ఇప్పటికి వచ్చిన మార్పులు చూడాలని చెప్పారు. ఆరు నెలల పాలనలోనే రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని గుర్తించాలని సూచించారు. ‘రైతు భరోసా పేరుతో ఇస్తామన్న రూ. 15 వేలు ఇచ్చారా.. కౌలు రైతులకు, రైతు కూలీలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. చేశారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

త‌న‌కు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ద‌స్త్రంపై డిసెంబ‌ర్ 9న తొలి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారు. డిసెంబ‌ర్ 9 పోయింది.. మ‌రో ప‌ది రోజులు అయితే జూన్ 9 వస్త‌ది. ఆరు నెల‌లు గ‌డిచిపోత‌ది. తొలిరోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో ఆలోచించాల‌ని గ్రాడ్యుయేట్ల‌ను కేటీఆర్ కోరారు. రైతు భ‌రోసా 15 వేలు ఇస్తా.. భూయ‌జ‌మాలకు కాదు కౌలు రైతుల‌కు కూడా రైతుభ‌రోసా ఇస్తాన‌ని రేవంత్ న‌మ్మ‌బ‌లికారు. రైతు కూలీల‌కు ఏడాదికి 12 వేలు ఇస్తాన‌ని పేర్కొన్నారు. కౌలు రైతుల‌కు రైతు భ‌రోసా రాలేద‌ని అన్నారు.

ఈ ఎన్నిక‌ల‌తో ఫ‌లితంలో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు. తారుమార అయ్యేది లేదు. 6 నెల‌ల క్రితం అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగాయి. కేసీఆర్‌తో స‌హా అంద‌రం ప్ర‌తి నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించాం. ద‌య‌చేసి మోస‌పోకండి.. గోస‌ప‌డుతామ‌ని చెప్పాము. కానీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వాగ్దానాలు న‌మ్మి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

చ‌దువుకున్న విద్యావంతులు కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని కోరుతున్నాను. ప్ర‌స్తుతం వ్య‌వ‌సాయం ప‌రిస్థితి ఏంటో ఆలోచించండి. ఎన్నిక‌ల‌ప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అంద‌మైన నినాదాలు ఎక్క‌డున్నాయో ఆలోచించండి.
ఒకసారి మోసపోతే అది మోసపోయిన వారి తప్పుకాదని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, రెండోసారి కూడా మోసపోతే మాత్రం తప్పు మోసపోయిన వారిదేనని తేల్చిచెప్పారు

మాన‌వ‌త్వం ప‌రిమ‌ళించిన వేళ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్ర‌మాదానికి గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో హాస్పిటల్‌కు తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి వెంటనే కారు దిగారు. తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్‌కు తరలించారు. సకాలంలో స్పందించి బాధితుడికి అండగా నిలిచిన కేటీఆర్‌ను పలువురు ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement