Monday, April 29, 2024

BRS Campaign – ఎయిర్ ఇండియాను మూసేసినోడు షుగ‌ర్ ఫ్యాక్ట‌రీని తెరుస్తాడా….అమిత్ షా పై క‌విత మండిపాటు

కోరుట్ల: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని సూచించారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అమిత్ షా అన్నారని, ఎయిర్ ఇండియా వంటి పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తదటా అని ఎద్దేవా చేశారు. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల టౌన్‌లో నిర్వహించిన రోడ్ షోలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కవిత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు బయటి వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని, తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు. తెలంగాణ కుటుంబంలోకి వచ్చి ఆ నాయకులు వైరుధ్యాలు సృష్టించలేరని, గొడవపెట్టలేరని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవని, గత పదేళ్లో ఎటాంటి అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. మనం అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా ? అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు.

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పింది ఎప్పుడూ చేయలేదని, కాబట్టి ఆ రెండు పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. వాట్సప్ లో ఆ పార్టీలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2 ల‌క్ష‌ల 32 వేల ఉద్యోగాలను ప్రకటించామని, 1.6 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని గుర్తు చేశారు. న్యూయార్క్ ఎలా ఉందో హైదరాబాద్ అలా అయ్యిందని, పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలో దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు మద్ధతివ్వాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 2 వేల పెన్షన్ ఇస్తుంటే అందులో రూ. 1200 గ్యాస్ సిలిండర్ కే పోతున్నాయని, కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించడానికి సీఎం కేసీఆర్ రూ. 400 కే అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఎన్ని సార్లు సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదని, దాంతో తామే తగ్గించి పేదలపై భారం తగ్గించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కోరుట్లలో వెయ్యి ప్లాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి సంజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement