Friday, May 17, 2024

BJP Counters – కాంగ్రెస్ అమ్ముడుపోతుంది.. బిఆర్ఎస్ కొనుగోలు చేస్తుంది … కిష‌న్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక రాజకీయ అజ్ఞాని అన్నారు. తెలంగాణ ప్రజలు నివురు గప్పిన నిప్పులా ఉన్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని, అసలు బీఆర్ఎస్‌కు కాంగ్రెస్సే బీ-టీమ్ అన్నారు. రాహుల్ గాంధీకి అసలు తెలంగాణపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరారు. బీఆర్ఎస్ కు కేఎస్ రత్నం నిన్ననే రాజీనామా చేశారు. శుక్రవారం నాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో కేఎస్ రత్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేఎస్ రత్నానికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ఆయన తోసి పుచ్చారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే రాహుల్ గాంధీకి అలవాటని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ ఎమిటో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమిటో , తెలంగాణ చరిత్ర ఏమిటో తెలియని రాజకీయ అజ్ఞాని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ కు బీ టీమ్ కాంగ్రెస్ పార్టీయేనని ఆయన కౌంటరిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు. తెలంగాణ ఒక మాఫియా చేతిలో బందీగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు బీజేపీ విముక్తి చేస్తుందన్నారు. బీజేపీపై ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు అవినీతి పార్టీలన్నారు. ఈ రెండు పార్టీలు నియంతల అడుగు జాడల్లో నడిచే పార్టీలుగా ఆయన విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement