Saturday, May 18, 2024

రేపు ఆరెపల్లి మోహన్ బీజేపీలో చేరిక

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఆరెపల్లి మోహన్ రేపు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రేపు సాయంత్రం 5 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్, జాయినింగ్స్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఆరెపల్లి మోహన్ తోపాటు బీఆర్ఎస్ కు చెందిన స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులతోపాటు సుమారు 100 మంది ప్రజా ప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి ఈరోజు కరీంనగర్ ఎంపీ కార్యాలయానికి వచ్చిన ఆరెపల్లి మోహన్ బండి సంజయ్ ను కలిశారు. దాదాపు అరగంటపాటు సంజయ్ తో భేటీ అయిన ఆరెపల్లి మోహన్ తనతోపాటు పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పార్టీలో అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. మానకొండురుసహా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా టిక్కెట్ల కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. అందులో భాగంగా సర్వే నివేదికలను ఆధారంగా చేసుకుని అధిష్టానం టిక్కెట్లు ఇస్తుందన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలున్నారని, వారందరిని కలుపుకుని పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

అనంతరం ఆరెపల్లి మోహన్ మానకొండూరు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేతలతోపాటు మండలాధ్యక్షులకు, జిల్లా నేతలకు ఫోన్లు చేసి బీజేపీలో తాను చేరుతున్న కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. మరోవైపు ఆరెపల్లి మోహన్ అనుచరులు రెండ్రోజుల్లో మానకొండూరుకు ఆహ్వానించి భారీ ఎత్తున స్వాగత సత్కార సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement