Thursday, May 2, 2024

ఆదివాసీ పల్లెలు ప్రకృతి నిలయాలు : కలెక్టర్ రాహుల్ రాజ్

తాంసి, (ప్రభ న్యూస్) : శుచి శుభ్రతను పాటిస్తూ జీవనం సాగించే ఆదివాసీ పల్లెలు ప్రకృతి నిలయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అంబుగమ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మొదటి సారిగా గ్రామానికి వచ్చిన కలెక్టర్ కు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా ఉన్న కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ అంబుగమ గ్రామంలో చేసిన అభివృద్ధి పై వివరించారు.

గ్రామ సమస్యలు కలెక్టర్ దృష్టికి
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని అంబుగమ గ్రామ పంచాయతీ నూతన పంచాయతీగా ఏర్పడినప్పటికి గ్రామానికి త్రీఫెజ్ కరెంట్, తాగు నీటి ఇబ్బంది, మిషన్ భగీరథ నీరు అందక పోవడంతో ఎండాకాలం వచ్చిందంటే ఇబ్బందులు తప్పవని తాంసి మండల్ తుడుం దెబ్బ అధ్యక్షుడు భరత్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు.అదే విధంగా గ్రామానికి చెరువు పూడిక తీయక పోవడంతో 600 ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదని వివరించారు.సమస్య లపై స్పందించిన కలెక్టర్ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తూర్పా భాయి యశ్వంత్, ఎంపీపీ మంజుల, పీఏసిఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ ఆకుల భూమయ్య, ఆదివాసీ తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు ఆత్రం భరత్, గ్రామ పటేల్ ఆత్రం మలకు, మహాజన్ మేస్రం శంబాజి, కుంర కేషో రావు, గడ్డం భూమరెడ్డి, దుర్వ భీంరావు, మండల అధికారులు, ఆయా గ్రామ సర్పంచ్ లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement