Monday, May 6, 2024

తెలంగాణలో హీటెక్కిన కరెంటు మీటర్ల రాజకీయం.. సీఎం కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్‌

కొన్ని రోజులుగా తెలంగాణలో కరెంటు మీటర్ల రాజకీయం హీటెక్కింది. ఈ ఇష్యూపై కేసీఆర్‌, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర సర్కార్. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించింది కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వశాఖ. అపోహలు -వాస్తవాలు పేరిట కేంద్రమంత్రి ఆర్‌.కె.సింగ్‌ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జనగామ, భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభల్లో కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్‌. విద్యుత్‌ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యసాయ బోర్లు, బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు గులాబీ బాస్. కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు అమలు చేస్తే లాండ్రీలు, పౌల్ట్రీలు, దళితులకు విద్యుత్‌ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండదని చెప్పారాయన. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు మాత్రమే FRBM పరిమితి అరశాతం పెంచారని, దీని వల్ల ఐదేళ్లలో తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం జరిగే అవకాశముందన్నారు సీఎం.

అయితే, కేసీఆర్‌ ఆరోపణలు ఖండించింది కేంద్ర విద్యుత్‌ శాఖ. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్‌ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైనా ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. సౌర విద్యుత్‌ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్‌ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్‌ బిడ్ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయని, ఇదంతా బహిరంగంగానే జరుగుతుందని తెలిపింది కేంద్రం. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అపోహలు, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని కామెంట్‌ చేసింది కేంద్రం.

Advertisement

తాజా వార్తలు

Advertisement