Saturday, May 11, 2024

TS | తెలంగాణ‌లో ఉరుములు, మెరుపుల‌తో రాళ్ల వాన‌.. పిడుగుపాటుకు గీత కార్మికుడి మృతి

తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో రాళ్లతో కూడిన వర్షం పడడంతో ఆరబోసిన వడ్లు త‌డిసి అక్క‌ర‌కు రాకుండా పోతున్నాయి. జగిత్యాల జిల్లా లోని ముత్యంపేట గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గీతకార్మికుడు ముత్యపు మల్లేశం తాటి చెట్టు ఎక్కుతుండగా చెట్టుపై పిడుగుపడి అక్కడికక్కడే చ‌నిపోయాడు. జిల్లాలోని మేడిపల్లి భీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు 20 మేకలు చ‌నిపోయాయి. ఇక‌.. మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. కోరుట్లలోని కిష్టంపేటలో పిడుగుపాటుకు నాగుల రవికి చెందిన బ‌ర్రె చ‌నిపోయింది.

ప‌లు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో కరెంట్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడింది. సిరిసిల్లా మండలం దమ్మనపేటలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో అన్నం నర్సగౌడ్‌కు చెందిన పాడి బ‌ర్రె చ‌నిపోయిన‌ట్టు స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement