Friday, April 19, 2024

టెక్స్ టైల్‌ రంగం అభివృద్ధికి రోడ్‌ మ్యాప్‌.. సమగ్ర నివేదిక తయారు చేయండి: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో టెక్స్ టైల్‌ రంగాన్ని మరింతగా అభివృద్ధి పరిచేందుకు అవసరమైన రోడ్డు మ్యాప్‌ నివేదికను తయారు చేయాలని టెక్స్ టైల్‌శాఖ అధికారులకు మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణ టెక్స్ టైల్‌ రంగంలో పెట్టుబడులకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈ రంగాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన కార్యాచరణ, భవిష్యత్‌ ప్రణాళికలపైన ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. టెక్స్ టైల్‌శాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలతో పాటు బడ్జెట్‌లో పొందుపర్చాల్సిన కార్యక్రమాలు, పథకాలు, ఇతర అంశాలపైన శాఖ ఉన్నతాధికారులతో హైదరాబాద్‌లో సోమవారం జరిగిన సమావేశంలో పలు సూచనలు చేశారు.

 గత ఏడున్నర సంవత్సరాలుగా తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వాటి సత్ఫలితాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఈ రంగంలో ఉపాధి కల్పనే ప్రాథమిక లక్ష్యంగా, నేతన్నల సంక్షేమమే పరమావధిగా అనేక వినూత్నమైన కార్యక్రమాలను తీసుకువచ్చిన విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేవలం నేతన్నలకు సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి ఇస్తున్న టెక్స్‌టైల్‌ రంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం, ఈ రంగానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించిందని కేటీఆర్‌ తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్కు కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అంతర్జాతీయ కంపెనీలు యంగ్‌ వన్‌, దేశీయ టెక్స్ టైల్‌ దిగ్గజమైన కిటెక్స్‌లాంటి అనేక కంపెనీలు తెలంగాణలో ఉన్న అవకాశాలను, ఇక్కడి మానవ వనరులు, ప్రభుత్వ పాలసీలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్న టెక్స్ టైల్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన మౌలిక వసతులు, నూతన పాలసీలు, నేతన్నల కోసం చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, టెక్స్ టైల్‌, టెక్స్ టైల్‌ అనుబంధ రంగాల్లో తీసుకురావాల్సిన మరిన్ని కార్యక్రమాల లాంటి అన్నింటిని ఈ నివేదికలో పొందుపరచాలని సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టెక్స్ టైల్‌ శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement