Tuesday, March 26, 2024

పెట్రోల్‌పై రూ.3 తగ్గింపు!

దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రూ.105 మార్క్ దాటేసి పరుగు పెడుతోంది. దీంతో సామాన్యులు తమ వాహనాలు బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. పెట్రోల్ ధర కంటే కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వేసే పన్నులే చమురు ధరలకు పెరుగుదల కారణం. ప్రభుత్వాలు పన్నుల తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త అదుపులోకి వస్తాయని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.3 మేర సంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

దీనికి సంబంధించిన తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ శుక్రవారం ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ చమురు ధరల నుంచి సామాన్యులకు ఊరట కలిగిచాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని త్యాగరాజన్ తెలిపారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం తమిళనాడులో రూ.102.49 ఉన్న పెట్రోల్‌… స్టాలిన్ సర్కార్ నిర్ణయంతో రూ.100 కంటే తక్కువగా కానుంది. ఇక తమిళనాడు సర్కార్‌ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం పై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్‌ను సమర్పించింది.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు

Advertisement

తాజా వార్తలు

Advertisement